బీహార్ బిజెపి బంద్ హింసాత్మకం, నేడే నితీష్ 'విశ్వాసం'
బిజెపి అగ్రనేతలు సుశీల్ కుమార్ మోడీ, రవిశంకర్రపసాద్, సిపి ఠాకూర్ సహా 3,227 మంది అరెస్టయ్యారు. కార్యకర్తలు కర్రలతో కొట్టుకోవడంతో పలువురికి గాయాలయ్యాయి. కొందరికి తలలు పగిలాయి. ప్రభుత్వ వాహనాలను బిజెపి కార్యకర్తలు ధ్వంసం చేశారు. జెడి(యు) రాష్ట్ర అధికార ప్రతినిధి రాజీవ్ రంజన్ నేతృత్వంలో పలువురు కార్యకర్తలు తమ కార్యాలయం వైపు వస్తుండగా బిజెపి కార్యకర్తలు అడ్డుచెప్పడంతో ఘర్షణ మొదలైంది.
ఘర్షణలో గాయపడిన రంజన్ను పాట్నా వైద్యకళాశాల ఆస్పత్రిలో ఐసియులో చేర్చారు. బిజెపి బంద్ను విశ్వాసఘాత దినంగా ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అభివర్ణించారు. రాజకీయాలకు రాజకీయాలతోనే సమాధానమిస్తామన్నారు.1974 నాటి జెపి ఉద్యమం తర్వాత తొలిసారిగా వ్యాపారులు తమ దుకాణాలను స్వచ్ఛందంగా మూసి ప్రభుత్వంపై తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారని మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్ మోడీ తెలిపారు.
బంద్ను విఫలం చేసేందుకు ముఖ్యమంత్రి తన పార్టీ కార్యక ర్తలను రెచ్చగొట్టి పంపారని బీహార్ బిజెపి అధ్యక్షుడు మంగళ్పాండే ఆరోపించారు. 32వ నెంబరు జాతీయ రహదారిని నిరసనకారులు నిర్బంధించారు.
ముందే విశ్వాసం
బిజెపితో మైత్రీబంధాన్ని తెంచుకున్న నితీశ్ కుమార్ బుధవారం విశ్వాసపరీక్షను ఎదుర్కోబోతున్నారు. 243 మంది సభ్యులున్న శాసనసభలో జెడి(యు)కు 118, బిజెపి-91, ఆర్జెడి-22, కాంగ్రెస్-4, ఎల్జెపి, సిపిఐలకు ఒక్కొక్కరు, ఆరుగురు స్వతంత్ర సభ్యులు ఉన్నారు. మేజిక్ సంఖ్య 122 కావాలంటే పాలకపక్షానికి ఇంకా నలుగురు సభ్యుల మద్దతు అవసరం. స్వతంత్రులలో ఐదుగురు ఇప్పటికే మద్దతు తెలిపేందుకు ముందుకొచ్చారు. దీంతో సర్కారుకు ఢోకా లేనట్లే.