నితీష్ విశ్వాస తీర్మానం ప్రతిపాదన: బిజెపి వాకౌట్
శాసనసభ సమావేశం కాగానే బిజెపి సభ్యులు గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి అనుకూలంగా నినాదాలు చేశారు. తాము తమ పార్టీ శానససభ్యులకు విప్ జారీ చేసినట్లు వచ్చిన వార్తలను మాజీ డిప్యూటీ ముఖ్యమంత్రి, బిజెపి నేత సుశీల్ కుమార్ మోడీ ఖండించారు. సభలో పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు.
నితీష్ కుమార్ విశ్వాస పరీక్షలో నెగ్గే అవకాశాలున్నాయి. ఓటింగుకు దూరంగా ఉండాలని నలుగురు సభ్యుల కాంగ్రెసు శాసనసభా పక్షం నిర్ణయం తీసుకుంది. తాము కేంద్ర నాయకత్వం నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నప్పటికీ వోటింగుకు దూరంగా ఉండాలని తాము నిర్ణయం తీసుకున్నామని సిఎల్పీ నేత సదానంద్ సింగ్ ఓ వార్తాసంస్థతో చెప్పారు.
బిజెపికి చెందిన 11 మంది మంత్రులకు ఉద్వాసన పలికిన తర్వాత నితీష్ కుమార్ గవర్నర్ పాటిల్ను ఆదివారం కలిసి బలపరీక్ష కోసం శాసనసభ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. జెడియు ప్రభుత్వానికి అవసరమైన మెజారిటీ సభలో ఉంది. దాంతో నితీష్ కుమార్ ప్రభుత్వానికి ఏ విధమైన ముప్పు లేదు.
శానససభ మొత్తం సభ్యుల సంఖ్య 243 కాగా, జెడియుకు 118 మంది (స్పీకర్ సహా) ఉన్నారు. బిజెపికి 91 మంది, ఆర్జెడికి 22 మంది, కాంగ్రెసుకు 4గురు, ఎల్జెపి, సిపిఐకి ఒక్కరేసి సభ్యులు ఉన్నారు. ఆరుగురు స్వతంత్ర శాసనసభ్యులున్నారు. మెజారిటీకి నితీష్ ప్రభుత్వానికి 122 మంది సభ్యుల మద్దతు అవసరం. ఇప్పటికే నలుగురు ఇండిపెండెంట్ సభ్యులు మద్దతు పలికారు. ఎల్జెపి సభ్యుడు జకీర్ హుస్సేన్ కూడా నితీష్కు మద్దతు ఇస్తున్నారు. దీంతో అవసరమైన మెజారిటీ సమకూరింది. మరో ఇద్దరు స్వతంత్ర సభ్యులు బిజెపి వెంట ఉన్నారు.