విశ్వాసంలో నెగ్గిన నితీష్, బిజెపిని తూర్పారబట్టిన సిఎం
చర్చ అనంతరం ఓటింగ్ జరిగింది. ఈ ఓటింగులో నితీష్కు అనుకూలంగా 126 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 24 ఓట్లు వచ్చాయి. ఆర్జెడి వ్యతిరేకంగా ఓట్లు వేసింది. ఓటింగ్ సమయంలో నితీష్ కుమార్ భారతీయ జనతా పార్టీ తీరును తప్పు పట్టారు.
ఎన్డీయే విధానాలను బిజెపి తప్పుదారి పట్టిస్తోందని మండిపడ్డారు. ఇక బీహార్లో పూర్తి లౌకికవాదన పాలన కొనసాగుతుందన్నారు. బిజెపి అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీని బిజెపి అవమానించిందన్నారు. బీహార్ ప్రజలకు సుపరిపాలన అందించడమే తమ ప్రభుత్వం లక్ష్యమని అన్నారు. లౌకికవాదంపై రాజీపడే ప్రసక్తి లేదన్నారు. బీహార్ సంకీర్ణ ప్రభుత్వంలో బయటి వ్యక్తుల జోక్యాన్ని తాము ఎట్టి పరిస్థితుల్లో సహించమన్నారు. బిజెపి జెడియుని వంచించి, అద్వానీని కించపర్చిందన్నారు. బిజెపివి అవకాశవాద రాజకీయాలన్నారు.
కాగా, బిజెపి, జెడి (యు) తెగదెంపులు చేసుకున్న నేపథ్యంలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ బుధవారం శానససభలో విశ్వాస తీర్మానం కోసం శాసనసభ ప్రత్యేకంగా సమావేశమైంది. ఓటింగు వల్ల ప్రయోజనం లేదని, నితీష్ కుమార్ సంఖ్యాబలాన్ని కూడగట్టుకున్నారని అంటూ బిజెపి శానససభ నుంచి అంతకుముందు వాకౌట్ చేసింది. తాము ఎట్టి పరిస్థితుల్లో నితీష్ను సమర్థించేది లేదని ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ చెప్పారు. శాసనసభ సమావేశం కాగానే బిజెపి సభ్యులు గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి అనుకూలంగా నినాదాలు చేశారు.
శానససభ మొత్తం సభ్యుల సంఖ్య 243 కాగా జెడి(యు)కు 118 మంది (స్పీకర్ సహా) ఉన్నారు. బిజెపికి 91 మంది, ఆర్జెడికి 22 మంది, కాంగ్రెసుకు 4గురు, ఎల్జెపి, సిపిఐకి ఒక్కరేసి సభ్యులు ఉన్నారు. ఆరుగురు స్వతంత్ర శాసనసభ్యులున్నారు.