దగ్గుబాటి బ్లాక్మెయిల్, పొరపాటంటే ఏంటి?: టిఎస్సార్
దగ్గుబాటి తాను పొరపాటున మాట్లాడానని చెబితే ఏమిటని ప్రశ్నించారు. దగ్గుబాటికి తాను ఇప్పటికే లీగల్ నోటీసులను పంపించానని చెప్పారు. ఇప్పటికైనా ఆయన క్షమాపణలు చెప్పాలని సూచించారు. లేదంటే తాను ఎట్టి పరిస్థితుల్లో ఆయన పైన రూ.5 కోట్ల క్రిమినల్ దావా వేస్తానని హెచ్చరించారు.
కాగా విశాఖ లోకసభ సీటుపై దగ్గుబాటి వెంకటేశ్వర రావు, టి.సుబ్బిరామి రెడ్డిల మధ్య వివాదం చెలరేగుతున్న విషయం తెలిసిందే. ఇటీవల దగ్గుబాటి టిఎస్సార్ పైన తీవ్ర విమర్శలు చేశారు. దానికి సుబ్బిరామి రెడ్డి లీగల్ నోటీసులు పంపించారు. తనకు క్షమాపణలు చెప్పాలని లేదంటే కేసు వేస్తానని హెచ్చరించారు. ఈ వివాదం వారి మధ్య కొనసాగుతోంది.
ఇద్దరి మధ్య వివాదం గురించి ఇటీవల దగ్గుబాటి మాట్లాడుతూ.. తనతో పెట్టుకుంటే రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బిరామి రెడ్డికే నష్టమని కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత దగ్గుబాటి వెంకటేశ్వర రావు మంగళవారం హెచ్చరించారు. ఆయన పంపిన లీగల్ నోటీసుల అంశం తాను కోర్టులోనే తేల్చుకుంటానని చెప్పారు. తనను రెచ్చగొట్టవద్దని, అదే చేస్తే చాలా విషయాలు బయట పెట్టాల్సి ఉంటుందని హెచ్చరించారు. తమ ఇద్దరి వివాదం వల్ల పార్టీకి ఎలాంటి నష్టం లేదని దగ్గుబాటి వివరించారు.