హరిద్వార్లో 40 శవాలు: మృతుల సంఖ్య 190
డెహ్రూడూన్: ప్రకృతి విలయతాండవానికి మరణించినవారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. హరిద్వార్లో తాజాగా శుక్రవారం 40 మృతదేహాలు బయటపడ్డాయి. దీంతో మృతుల సంఖ్య 190కి పెరిగింది. కేదార్నాథ్, బద్రీనాథ్ల్లో చిక్కుకుపోయిన 9000 వేల మందికిపైగా బాధితులను రక్షించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకు 40 హెలికాప్టర్లను రంగంలోకి దించారు.
ప్రకృతి విపత్తు అతి భయంకరంగా ఉంది. దీంతో మృతుల సంఖ్య దిగ్భ్రాంతికరంగా ఉందని ఉత్తరాఖండ్ ప్రిన్సిపుల్ సెక్రటరీ రాకేష్ శర్మ అన్నారు. వరదలకు, తెరిపి లేని వర్షాలకు మరణించినవారి 40 మృతదేహాలు బయటపడ్డాయని హరిద్వార్ ఎస్ఎస్పీ రాజీవ్ స్వరూప్ చెప్పారు. బద్రీనాథ్లో చిక్కుకుపోయిన 9 వేల మందిని తరలించడానికి ముందు కేదార్నాథ్లో చిక్కుకుపోయిన 250 మందిని తరలించడానికి ప్రయత్నిస్తున్నారు.

ఈ మిలీనియం అత్యంత దారుణమైన ప్రమాదంగా వ్యవసాయ శాఖ మంత్రి హరక్ సింగ్ రావత్ దాన్ని అభివర్ణించారు. కేదార్నాథ్ తిరిగి సాధారణ స్థితికి రావడానికి, పునరుద్ధరణ జరగడానికి కనీసం ఐదేళ్లు పడుతుందని ఆయన అన్నారు. ఆయన కేదార్నాథ్ ప్రాంతంలో పర్యటించారు. కేదార్నాథ్ స్మశానాన్ని తలపిస్తోంది. మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఆలయ ప్రాంగణంలో కూడా శవాలు పడి ఉన్నాయి.
వేలాది మంది ప్రజలు ఇప్పటికీ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో చిక్కుపడిపోయారు. హిమాచల్ ప్రదేశ్లో కన్నౌర్ జిల్లాలోని వరద, వర్షం తాకిడి ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి సహాయక చర్యలు సాగుతున్నాయి. బిజెపి ప్రచార కమిటీ సారథి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ రేపు శనివారం వరద తాకిడి ప్రాంతాల్లో పర్యటించనున్నారు.












Click it and Unblock the Notifications