ఆర్మీ తెగువ: 45 మంది పిల్లలు బయటపడ్డారు
డెహ్రడూన్: హిమాలయ పర్వత ప్రాంతం పిండారి నుంచి 45 మంది పిల్లలను సైన్యం సురక్షితంగా బయటకు తరలించింది. ఉత్తరఖండ్లోని వివిధ ప్రాంతాల్లో వారు చిక్కుకుపోయారు. పిండారీ హిమానీనదం నుంచి మరో పిల్లల గుంపు ఎక్కడుందనే విషయాన్ని గుర్తించడానికి సైన్యం ప్రయత్నాలు చేస్తోంది. కీమోన్ పర్వత ప్రాంతంలోని పిండారీకి వెళ్లడం చాలా సులభం. ఇది నందాదేవి, నందాకోట్ శిఖరాలకు మధ్య ఉంటుంది.
అత్యంత సుందరప్రదేశమైన పిండారీకి వెళ్లేందుకు ట్రెక్కర్స్ ఇష్టపడుతారు. ఈ హిమానీనదం 5 కిలోమీటర్ల పొడువు ఉంటుంది. ఉత్తరఖండ్లోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయినవారిని సురక్షితంగా తరలించేందుకు 8,500 మంది ఆర్మీ జవాన్లు శ్రమిస్తున్నారు. గంగోత్రి, జోష్మీనాత్, బద్రీనాథ్, కేదార్నాథ్, పిండారిల నుంచి దాదాపు 18 వేల మందిని సైనికులు బయటకు తరలించినట్లు సెంట్రల్ కమాండ్ జిఓసి - ఇన్- చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ అనిల్ చైత్ శనివారం లక్నోలో మీడియాతో చెప్పారు.
దాదాపు 19 వైద్య కేంద్రాలను, పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. వరదల ఆగ్రహానికి దాదాపు 40వేల చదరపు కిలోమీటర్ల ప్రాంతం విధ్వంసానికి గురైనట్లు ఆయన చెప్పారు. చార్ధామ్ మార్గంలో 400 కిలోమీటర్ల రోడ్డు వ్యవస్థ దెబ్బ తిన్నదని అన్నారు. ప్రజలను సురక్షితంగా తరలించడానికి శుక్రవారం చిన్నపాటి వంతెనలను నిర్మించినట్లు తెలిపారు.
ఉత్తరకాశీ నుంచి హార్సీల్ వరకు రోడ్డు వ్యవస్థ బాగుపడిందని, 250 మంది ప్రజలు ఈ మార్గంలో బయటకు వచ్చారని చెప్పారు. గంగోత్రి ప్రాంతంలో దాదాపు 500 మందిని రక్షించినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి విజయ బహుగుణను శుక్రవారంనాడు కలిసి తాము చేపట్టిన సహాయక చర్యల గురించి వివరించినట్లు చైత్ చెప్పారు. గంగోత్రి ప్రాంతంలోని ప్రజలను ఆదివారంనాటికి తరలిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.
శుక్రవారం నుంచి 768 మంది బాధితులు తమ కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు జవాన్లు సహకరించినట్లు తెలిపారు. మంగళపట్టి ప్రాంతంలోని వేయి మందికి సహాయం చేసినట్లు చెప్పారు. గౌరీకుండ్ నుంచి బాధితులను తరలించే కార్యక్రమం ప్రారంభమైందని అన్నారు. బద్రీనాథ్ నుంచి జోషిమఠ్, రుద్రప్రయాగ్ వెళ్లే అలకానంద వంతెనపై చిక్కుకుపోయిన కొంత మందిని రక్షించినట్లు చెప్పారు.
హేమకుండ్ చేరుకోవడానికి కూడా సైన్యం ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలిపారు. గోవింద్ఘాట్లో అలకానంద నదిపై సైన్యం వంతెన నిర్మించినట్లు తెలిపారు. వరదల వల్ల బురదలో కూరుకుపోయిన నడక దారులను పునరుద్దరించినట్లు ఆయన తెలిపారు.