ఆగ్రహం, ఆవేదన: జగన్ పార్టీలోకి మోపిదేవి పచ్చజెండా

తన అనుచరులను జగన్ పార్టీలోకి పంపించడం ద్వారా ఆయన తాను కాంగ్రెసు పార్టీని వీడిన సంకేతాలు ఇవ్వనున్నారు. తొలుత ఆయన వర్గం కాంగ్రెసు కార్యకర్తలు ఈ నెల 4వ తేదిన రాష్ట్ర రాజధాని హైదరాబాదులో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల శాసన సభ్యురాలు వైయస్ విజయమ్మ సమక్షంలో జగన్ పార్టీలో చేరనున్నారు. చేరేవారిలో మోపిదేవి సోదరుడు హరనాథ బాబు కూడా ఉన్నారట.
మోపిదేవి సోదరుడు, సన్నిహితులు, రేపల్లె నియోజకవర్గానికి చెందిన ఆయన వర్గం కార్యకర్తలు అందరూ ఈ నెల 4వ తేది నుండి 7వ తేది వరకు జగన్ పార్టీలో చేరునున్నట్లు సమాచారం. మొదట ఆయన సన్నిహితులు, తర్వాత సోదరుడు... ఇలా ఒక్కరొక్కరు కాంగ్రెసు పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు. జగన్ పార్టీలో చేరేందుకు మోపిదేవి పచ్చజెండా ఊపినట్లు చెబుతున్నారు.
మోపిదేవి వెంకటరమణ ప్రస్తుతం చంచల్గూడ జైలులో ఉన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన ఆస్తుల కేసులో ఆయన అరెస్టయ్యారు. ఏడాదికి పైగా ఆయన జైలు జీవితం గడుపుతున్నారు. తనను కాంగ్రెసు పార్టీ నిర్లక్ష్యం చేసిందన్న ఆవేదన, ఆగ్రహం ఆయనలో కనిపిస్తోందని అంటున్నారు. కొద్ది నెలల క్రితం జిల్లాలో జరిగిన సమావేశంలో మోపిదేవి సోదరుడు ఈ అంశాన్ని లేవనెత్తారు. మిగతా మంత్రుల విషయంలో ఒకలా, తన విషయంలో ఒకలా వ్యవహరించిన కాంగ్రెసుకు గుడ్ బై చెప్పాలని ఆయన నిర్ణయానికి వచ్చే, తన సన్నిహితులు, కుటుంబ సభ్యులకు పచ్చజెండా ఊపారట.












Click it and Unblock the Notifications