ఆ ముగ్గురు సీమ ద్రోహులే, మా సంగతి తేల్చండి: బైరెడ్డి
హైదరాబాద్: రాయలసీమకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి మోసం చేస్తున్నారని, సీమ ఎమ్మెల్యేలంతా దొంగలని రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర రెడ్డి గురువారం మండిపడ్డారు. రాయల తెలంగాణ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ బైరెడ్డి ఇందిరా పార్కు వద్ద 52 గంటల దీక్షను చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
హైదరాబాదులో ఉన్న శ్రీకృష్ణ దేవరాయలు, అన్నమయ్య విగ్రహాలను కూల్చి వేసినా సీమ నేతలు స్పందించలేదని మండిపడ్డారు. ఇప్పుడు రాయల తెలంగాణ ప్రతిపాదన వచ్చినా నేతలు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. తాము రాయల తెలంగాణ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. సీమను విభజిస్తే చూస్తూ ఊరుకోమన్నారు. సీమ నేతలు ఎందుకు నోరు మెదపడం లేదో చెప్పాలన్నారు.
సీమ విషయంలో కాంగ్రెసు పార్టీ అధిష్టానం, ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ ఏమనుకుంటుందన్నారు. తెలంగాణ ఇస్తారో లేదా చస్తారో వారిష్టం.. కానీ సీమను విభజిస్తే మాత్రం ఊరుకునేది లేదన్నారు. తెలంగాణ ఇస్తే రాయలసీమ రాష్ట్రం కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. మొదట సీమ సంగతి తేల్చిన తర్వాతనే తెలంగాణపై ఆలోచించాలన్నారు. తమ ప్రాంత నేతలు హైదరాబాదులో ఓ మాట, సీమలో మరో మాట చెబుతున్నారని ఆరోపించారు.
సీమ నేతలు రాయల తెలంగాణపై స్పందించకుంటే రాజకీయ సమాధి కాక తప్పదన్నారు. దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యలు హాస్యాస్పదమని, తాము తిరగబడితే ఈ ప్రభుత్వంలు ఎక్కడకు పోతాయని ప్రశ్నించారు. కిరణ్, చంద్రబాబు, జగన్ నోరు మెదపక పోవడం వల్ల సీమకు అన్యాయం జరుగుతుందన్నారు. వారిని పహిల్వాన్లుగా అభివర్ణించారు. తమ ప్రాంతాన్ని ఎలా కాపాడుకోవాలో తమకు తెలుసునన్నారు. హైకమాండ్, కేంద్రానికి కనువిప్పు కలిగేందుకు, తమ ప్రాంత నాయకుల భరతం పట్టేందుకు దీక్ష చేస్తున్నానని అన్నారు.