వివాహేతర సంబంధం, వ్యక్తి మృతి: ఇన్స్పెక్టర్ వీరంగం
జి. కొండూరు మండలం కోడూరు గ్రామానికి చెందిన పలగాని రామకృష్ణ (22) మృతదేహం నాలుగు రోజుల క్రితం అనుమానాస్పద స్థితిలో గుంటూరు జిల్లా తాడేపల్లి వద్ద కనపడింది. తర్వాత అతడి జేబులో ఉన్న కొరియర్ రసీదు ఆధారంగా జి.కొండూరు మండలం కోడూరులోని అతడి బంధువులకు పోలీసులు సమాచారం పంపారు. వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే కక్షతో అమ్మాయి బంధువులే అతడిని చంపించారంటూ.. రామకృష్ణ బంధువులు అతడి శవంతో సహా జి.కొండూరు పోలీసు స్టేషన్ వద్దకు చేరుకున్నారు.
మృతుడి నాయనమ్మ పార్వతితో పాటు కొందరు మహిళలు స్టేషన్లోనికి వెళ్లి ఎస్ఐ అబ్దుల్ హక్తో మాట్లాడారు. ఎస్ఐ వారి పట్ల దురుసుగా ప్రవర్తించి బూతులు తిట్టడంతో, బయట ఉన్నవాళ్లు ఆవేశంతో ఎస్ఐ అబ్దుల్ హక్ను స్టేషన్ బయటకు తీసుకొచ్చి చితకబాదారు. స్టేషన్ను ధ్వంసం చేశారు. ఈ విషయం తెలిసి మైలవరం సిఐ బంగార్రాజు తన సిబ్బందితో జి.కొండూరు పోలీసు స్టేషన్కు వచ్చారు. ఆయన వచ్చిన విషయం తెలిసి రామకృష్ణ బంధువులంతా ఒక్కసారిగా సిఐ వద్దకు పరుగున వెళ్లారు.
అంతమంది వచ్చేసరికి సిఐ తుపాకి బయటకు తీసి.. తొలుత తన కారు అద్దాలను కాల్చారు. తర్వాత ఒక రౌండు గాల్లోకి కాల్చారు. ఇక ఏకంగా జనం పైకే కాల్పులు జరిపారు. దీంతో మృతుని బంధువులు మరింత ఆగ్రహానికి గురై సిఐ బంగార్రాజును వెంటపడి తరిమారు. వారి ఆగ్రహం చూసిన సిఐ కారులో అక్కడినుంచి పరారయ్యారు. బాధితుల బంధువులు స్టేషన్లోకి చొరబడి అక్కడున్న ఫర్నిచర్ను ధ్వంసం చేశారు.
బయట ఉన్న రెండు జీపులను, అక్కడే ఉన్న 10 మోటార్ సైకిళ్లను కూడా ధ్వంసం చేశారు. చవఐ కాల్పుల్లో మైలవరానికి చెందిన చేదం కృష్ణకు ఛాతీ మీద, గుడిపూడి వెంకట్రామయ్యకు పొట్టలో, సింహాద్రి సూరిబాబు తొడలో, పజ్జూరు వెంకయ్యకు మోకాలి కింది భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
కాగా, జి.కొండూరు మండలం కోడూరుకు చెందిన ఓ యువతికి ఆరేళ్ల క్రితం వివాహమైంది. రామకృష్ణతో ఆమెకు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇటీవల ఇద్దరూ తమిళనాడు వెళ్లిపోయారు. అత్తమామలు ఫిర్యాదు చేయడంతో తమిళనాడు పోలీసులు వారి ఆచూకీ తెలుసుకుని జి.కొండూరు పోలీసులకు అప్పగించారు. గుంటూరు జిల్లా తాడేపల్లి వద్ద రామకృష్ణ గత నాలుగు రోజుల క్రితం శవమయ్యాడు. సంఘటన గురించి ఆందోళనకారులు, పోలీసులు పరస్పరం విభిన్న వాదనలు వినిపిస్తున్నారు.