ఉండవల్లి సభలో సమైక్యం, జగన్: నగరంలో సభపై గుత్తా

సమైక్యంగానే: గంటా
ఆంధ్ర ప్రదేశ్ ఎప్పటికి సమైక్యంగానే ఉంటుందని మంత్రి గంటా శ్రీనివాస రావు బుధవారం విశాఖలో అన్నారు. యూపిఏ సర్కారు రాష్ట్ర విభజన చేయదనే తాము భావిస్తున్నట్లు చెప్పారు. ఈ నెల 16వ తేదిన అనంతపురంలో సమైక్యాంధ్ర సభను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సమైక్యాంధ్ర సభ ఆలస్యంగా జరుగుతోందని ఆయన చెప్పారు. త్వరలో హైదరాబాదులో సభ నిర్వహిస్తామన్నారు.
హైదరాబాదులో సభ నిర్వహిస్తే...: గుత్తా
హైదరాబాదులో సమైక్య సభను నిర్వహిస్తే జరగబోయే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని నల్గొండ పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి హైదరాబాదులో అన్నారు. తెలంగాణ ఇచ్చేందుకు ఎలాంటి రోడ్ మ్యాప్ అవసరం లేదన్నారు. రెండు రాష్ట్రాలుగా విడిపోయి కలిసుందామన్నారు. నీరు, రాజధాని, రెవెన్యూ తదితర సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవచ్చునని చెప్పారు.
ఉండవల్లి సభ
కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, రాజమండ్రి పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ ఈ రోజు సాయంత్రం రాజమండ్రిలో వార్షికి నివేదిక మహాసభను నిర్వహించనున్నారు. ఈ సభ కోసం ఆయన అనుచరులు భారీ సంఖ్యలో జన సమీకరణ చేసే ప్రయత్నాల్లో ఉన్నారు.
ఈ సభలో ఉండవల్లి సమైక్య గళం వినిపించనున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని ఆయన ఈ సభలో డిమాండ్ చేయనున్నారు. అదే సమయంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి తాను ఎందుకు వ్యతిరేకంగా మారానే విషయాన్ని చెప్పనున్నారు.












Click it and Unblock the Notifications