తెలంగాణపై కోర్ కమిటీ భేటీలో ఎవరేమన్నారు?

కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యవాదం
తెలంగాణను విభజిస్తే అనేక సమస్యలకు తెరలేపినట్లే అని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. రాజకీయంగానూ ఈ నిర్ణయం తమకు మేలు చేయదని చెప్పినట్లు సమాచారం. రాష్ట్రంలో ప్రధాన ప్రాజెక్టులు ఒక ప్రాంతంలో ఉంటే వాటి కింద సాగు మరోచోట ఉందని, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి నీరు వెళ్లాలని, రాయలసీమలోని శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు తెరుచుకోకుంటే తెలంగాణ, ఆంధ్రకు నీళ్లు రావని ఆయన చెప్పినట్లు సమాచారం.
నాగార్జున సాగర్ తెలంగాణలో ఉన్నప్పటికీ దానికింద సాగు ఎక్కువభాగం కోస్తాలో జరుగుతోందని, ఇవన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయని, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి ఇది ప్రధాన కారణమని తెలిపారు. విభజన విషయంలో ఇది ప్రధానమైన సమస్య అని స్పష్టం చేశారు. నీటి యుద్ధాల ప్రస్తావన కూడా చేశారు. మహారాష్ట్ర, కర్ణాటకలతో ఉన్న సమస్యలు తెలంగాణ, సీమాంధ్ర మధ్య కూడా ఏర్పడతాయని హెచ్చరించారు. సుప్రీంకోర్టు కూడా ఇలాంటి వివాదాల్లో చిక్కుకుపోతోందని ఆయన వివరించినట్లు సమాచారం.
విభజన వల్ల తెలంగాణ ప్రాంతంలో మావోయిస్టులు మళ్లీ బలపడే ప్రమాదముందని, అది మరో ఛత్తీస్గఢ్లా మారిపోవచ్చని హెచ్చరించారు. విభజన వల్ల మత శక్తులు కూడా రెచ్చిపోతాయని తెలిపారు. తెలంగాణ ఇచ్చినంత మాత్రాన ఈ ప్రాంతంలో కాంగ్రెస్కే క్రెడిట్ దక్కి, మొత్తం ఓట్లు పడిపోవని, పైగా సీమాంధ్రలో దారుణంగా దెబ్బతింటామని ఆయన చెప్పినట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) బలహీనపడిందని ఆయన చెప్పారు. తెలంగాణకు భారీ ప్యాకేజీ, ప్రత్యేక మండలి ఇవ్వవచ్చునని ఆయన సూచించారు.
సమైక్యానికే బొత్స ఓటు
రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే మంచిదన్న అభిప్రాయమని బొత్స స్పష్టం చేసినట్లు తెలిసింది. 70% ఆర్థిక వనరులు హైదరాబాద్ నుంచే వస్తున్నాయని, విభజన జరిగితే హైదరాబాద్ మాటేమిటని ఆయన అన్నారు. తెలంగాణ ఏర్పడితే సీమాంధ్రకు రెవెన్యూ, నీటిపారుదల, ఉపాధి కల్పనతోపాటు అనేక రంగాల్లో అన్యాయం జరుగుతుందని చెప్పారు. తెలంగాణకు ప్రత్యేక మండలి ఏర్పాటు చేయవచ్చని సూచించారు.
దామోదర ప్రత్యేకవాదం
ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనరసింహ కోర్ కమిటీ ముందు ప్రత్యేక వాదాన్ని బలంగా వినిపించారు. దాదాపు 16 అంశాలను వివరించారు. గత 50 సంవత్సరాలుగా వివిధ రంగాల్లో తెలంగాణకు జరిగిన నష్టాన్ని ఆయన గణాంకాలతో సహా చెప్పారు. రాజకీయంగా కూడా తెలంగాణ నేతలకు అన్యాయమే జరుగుతోందని పలు అంశాలను ఉదహరించారు. విభజిస్తే నక్సలిజం పెరుగుతుందనే వాదనను ఖండించారు.
సీమాంధ్ర పెట్టుబడిదారులు హైదరాబాద్లో భారీ ఆస్తులు, ప్రత్యేక ఆర్థిక మండలాలు ఏర్పర్చుకున్నారని, వారి ప్రయోజనాలు దెబ్బతినకుండా చూస్తామంటే విభజనను వ్యతిరేకించే అవకాశం లేదని రాజనరసింహ చెప్పారు.












Click it and Unblock the Notifications