విభజనను అడ్డుకోవడానికి బ్రహ్మాస్త్రం ఉంది: లగడపాటి

2004, 2009 ఎన్నికల్లో ప్రజలు సమైక్యవాదానికే ఓటేశారని, మూడోసారి కూడా అధికారం తమదేనని ఆయన అన్నారు. రాష్ట్రాన్ని విడదీస్తే కాంగ్రెసుకు ఎక్కువ సీట్లు వస్తాయనే వాదనలో నిజం లేదని, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచితే కాంగ్రెసుకు 30 లోకసభ సీట్లు వస్తాయని ఆయన అన్నారు. రాష్ట్రం విడిపోయే పరిస్థితి వస్తే రాజీనామా చేయాల్సిన అవసరం లేదని, బ్రహ్మాస్త్రం ప్రయోగించడానికి సిద్ధంగా ఉందని ఆయన అన్నారు. తెలుగుతల్లి ఒడిలోని బ్రహ్మాస్త్రాన్ని చేతిలోకి తీసుకోకుండానే తమ స్టార్ బ్యాట్స్మెన్ పరిస్థితిని చక్కదిద్దుతారని ఆయన అన్నారు.
రాష్ట్ర విభజన జరిగితే తెలంగాణ బికారి అవుతుందని ఆయన అన్నారు. విద్వేషాలను రెచ్చగొట్టేవారే ప్రజలను విడదీస్తారని, కాంగ్రెసు అలాంటి పనిచేయదని ఆయన అన్నారు. ప్రభుత్వం, పార్టీలతో సంబంధం లేకుండా రాష్ట్రం సమైక్యంగానే ఉంటుందని అన్నారు. శాసనసభలో తీర్మానం చేసిన తర్వాతనే బిల్లు పార్లమెంటుకు వస్తుందని ఆయన చెప్పారు. విభజనకు రాజ్యాంగ సవరణ తప్పనిసరి అని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏది చేసినా ఓ పద్ధతి ప్రకారం చేస్తుందని ఆయన అన్నారు.
తెలంగాణపై ఈ నెలాఖరు లోపు నిర్ణయం వస్తుందని ఆయన చెప్పారు. డిసెంబర్ 9వ తేదీ ప్రకటన అసెంబ్లీ తీర్మానంతో ముడిపడి ఉందని, అసెంబ్లీ తీర్మానం అవసరం లేదని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు అన్నారని ఆయన గుర్తు చేశారు. విభజనకు అనుకూలమని చెప్పిన పార్టీలు ఎన్నికల్లో విజయం సాధించలేదని ఆయన అన్నారు. స్థానిక సంస్థల్లో తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలకు మధ్యే పోటీ ఉంటుందని ఆయన అన్నారు.
తెలంగాణ ఇస్తానని కాంగ్రెసు ఎప్పుడూ చెప్పలేదని, రెండో ఎస్సార్సీ కోసం కసరత్తు చేస్తోందని ఆయన అన్నారు. కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో కూడా సమైక్యవాదులున్నారని చెప్పారు. ప్రమాదం తొలగిపోలేదని, తెలుగుతల్లి మెడపై కత్తి వేలాడుతూనే ఉందని ఆయన అన్నారు. విలీనం చేసుకోవాలని కెసిఆర్ కాళ్లా వేళ్లా పడితే వద్దన్నామని లగడపాటి అన్నారు.












Click it and Unblock the Notifications