'జంజీర్' అలనాటి మేటి నటుడు ప్రాణ్ కన్నుమూత

ఆయన అంత్యక్రియలు ముంబైలోని శివాజీ పార్క్లో శనివారం మధ్యాహ్నం 12గంటలకు నిర్వహించనున్నారు. 93 సంవత్సరాల ప్రాణ్కు ఇద్దరు కుమారులున్నారు. ఆరు దశాబ్దాల కెరీర్లో 361 సినిమాల్లో నటించిన ప్రాణ్ ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నారు. భారతీయ సినిమా రంగంలో అత్యున్నత పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ఈ ఏడాదే అందుకున్నారు.
ప్రాణ్ పూర్తి పేరు ప్రాణ్ కిషన్ సికంద్. 1920, ఫిబ్రవరి 12న పాతఢిల్లీలోని ఒక సంపన్న కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి లాలా కేవల్ కిషన్ సికంద్ సివిల్ ఇంజనీర్, ప్రభుత్వ సివిల్ కాంట్రాక్టర్. తల్లి రామేశ్వరి. తండ్రి వృత్తి రీత్యా ప్రాణ్ చదువు పలు నగరాల్లో సాగింది. చదువులో మేటి అయిన ప్రాణ్ తొలుత ప్రొఫెషనల్ ఫొటో గ్రాఫర్ కావాలనుకున్నారు. 1940లో యమలా జాట్ సినిమాతో కెరీర్ ప్రారంభించారు. 1960, 70ల్లో విడుదలైన భారీ బడ్జెట్ హిందీ సినిమాలన్నిటిలోనూ ఆయన నటించారు.
ఆయన కెరీర్లో మిలాన్, మధుమతి, కశ్మీర్ కీ కలి వంటి క్లాసిక్స్ ఉన్నాయి. జంజీర్, డాన్, అమర్ అక్బర్ ఆంటోనీ వంటి బ్లాక్బస్టర్లున్నాయి. హిందీలో మేటి విలన్గా పేరొందిన ప్రాణ్ మన తెలుగులోనూ నటించారు. 1986లో విడుదలైన తాండ్ర పాపారాయుడు సినిమాలో బుస్సీ దొరగా, 1990లో వచ్చిన కొదమసింహం సినిమాలో మేయర్ పాత్రలో తెలుగు ప్రేక్షకులను అలరించారు.
1990 తర్వాత వయసు సహకరించకపోవడంతో ఆయన క్రమంగా తనకు వచ్చే ఆఫర్లను అంగీకరించడం మానేశారు. 2000 సంవత్సరంలో స్టార్ డస్ట్ పత్రిక ఆయన్ను 'విలన్ ఆఫ్ ద మిల్లీనియం'గా అభివర్ణించింది.2001లో భారత ప్రభుత్వం ఆయన్ను పద్మభూషణ్తో గౌరవించింది.












Click it and Unblock the Notifications