ధోనీ Vs సచిన్!: విభజనపై ఇటు జైపాల్, అటు కిరణ్

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమర్థవంతంగా సమైక్యాంధ్రకు అనుకూలంగా ప్రజెంటేషన్ ఇచ్చారని, అందువల్లనే అధిష్టానం తెలంగాణకు అనుకూలంగా తీసుకున్న నిర్ణయం నుండి వెనక్కి తగ్గిందని సీమాంధ్ర నేతలు భావిస్తున్నారు. తెలంగాణను ఇచ్చేద్దామనుకున్న అధిష్టానం మూడ్ను కిరణ్ మార్చారని సీమాంధ్ర నేతలు పొంగిపోతున్నారట. వర్కింగ్ కమిటీ సమావేశం ఏర్పాటు చేయడమంటేనే ఎక్కువ మంది వినేందుకు అస్కారం కల్పించినట్లయిందని వారు భావిస్తున్నారు.
అధిష్టానం ఇక తెలంగాణ మూడ్ నుండి వెనక్కి పోయిందని, పంచాయతీ ఎన్నికలలోపు తెలంగాణపై ప్రకటన ఉండదని వారు ధీమాగా ఉన్నారు. కోర్ కమిటీ తర్వాత నిర్ణయిస్తామని పార్టీ రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ చెప్పారని, కిరణ్ ప్రజెంటేషన్ తర్వాత.. అదిష్టానం సిడబ్ల్యూసి అన్నదని, ఆ తర్వాత యూపిఏ సమన్వయ కమిటీ, ఇతర పార్టీల ఆమోదం వంటి అంశాలు దాటే సమయానికి పార్లమెంటు ఎన్నికలు దగ్గరపడుతాయని, అంటే నిర్ణయం 2014 ఎన్నికలకు ముందు ఉండదని అర్థమైపోయిందని సీమాంధ్ర నేతలు భావిస్తున్నారట.
సమైక్యవాదిగా ముద్రపడినప్పటికీ కిరణ్ అధిష్టానానికి సంతృప్తి కలిగించేలా వాదనలు వినిపిస్తారని ఎవరూ భావించకపోయి ఉంటారని అంటున్నారు. అయితే కిరణ్.. ధోనీలా ఒక్కసారిగా విరుచుకుపడ్డారని, అందుకు ఆయన వెనుక బలమైన టీమ్, టీమ్ వర్క్ ఉందని, ఈ కారణంగానే తెలంగాణకు బ్రేక్ పడిందని సీమాంధ్ర నేతలు భావిస్తున్నారు.
మరోవైపు తెలంగాణ ప్రాంత నేతలు ఏమాత్రం ఆశలు వదులుకోలేదు. ఈ బ్రేక్ తాత్కాలికమేనని, జైపాల్ రెడ్డి అధిష్టానాన్ని ఒప్పించి తెలంగాణ తీసుకు వస్తారని తెలంగాణ ప్రాంత నేతలు ధీమాగా ఉన్నారు. పరిస్థితి మారలేదని, అధిష్టానం చెప్పినట్లుగానే త్వరలో నిర్ణయం ఉంటుందని భావిస్తున్నారట. మొదట కంగారుపడ్డ నేతలు జైపాల్ రెడ్డిని కలిసి పరిస్థితిని తెలుసుకున్నారట.
తెలంగాణ ఇవ్వకుంటే అక్కడ, ఇక్కడ కాంగ్రెసు పార్టీ నష్టపోతుందని, ఇస్తే తెలంగాణలో క్లీన్ స్వీప్ చేస్తుందని, అలాంటప్పుడు ఎందుకివ్వదని జైపాల్ తనను కలిసిన వారితో చెప్పారట. మరోవైపు చర్చలుండవని, నిర్ణయం చెబుతామని దిగ్విజయ్ సింగ్ చెప్పడాన్ని బట్టి కూడా తెలంగాణ నేతలు ప్రకటన వస్తుందని ఆశిస్తున్నారు.












Click it and Unblock the Notifications