కాంగ్రెసుది వంచన, నమ్మరు: కెసిఆర్, రాధాకృష్ణపై ఫైర్

కాంగ్రెసు నాయకుల జాదూలు, ఇలాంటి ఆజాదూలను తెలంగాణ ప్రజలు ఇక విశ్వసించరు అని టీఆర్ఎస్ అధినేత కేసిఆర్ అన్నారు. తాను ప్రాణాల మీదకు తెచ్చుకుని ఆమరణ నిరాహార దీక్ష చేస్తే కేంద్రం డిసెంబర్ 9న తెలంగాణ ఇస్తున్నట్లు ప్రకటించిందని, పది రోజులు కూడా గడవకుండానే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని నయ వంచన చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని ఆయన అన్నారు. ఇన్ని రకాల వంచనలకు పాల్పడ్డ కాంగ్రెస్ ఇప్పుడు కోర్ కమిటీ భేటీలోనే తెలంగాణను తేల్చేస్తారని అనుకుంటే అది పప్పులో కాలేసినట్లే అవుతుందని ఆయన వ్యాఖ్యానించారు.
చట్ట సభల్లో మహిళలకు రిజర్వేషన్ల కోసం నిర్ధేశించిన మహిళా బిల్లు విషయంలోనూ మోసం చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదేనన్నారు.ఆదిలాబాద్ జిల్లా ముధోల్ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు సముద్రాల వేణుగోపాలాచారి ఆదివారం తెలంగాణ భవన్లో కేసిఆర్ సమక్షంలో తెరాసలో చేరారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు 2001లో కరెంటు ఛార్జీల బిల్లులు పెంచిన రోజు నుండే ఆయన పతనం ప్రారంభమైందని కెసిఆర్. తెరాస ఉద్యమాన్ని చిన్నగా చేసి చూసిన చంద్రబాబు గానీ, సీమాంధ్ర మీడియా గానీ ఈ రోజున మహా ప్రభంజనమైన ఉద్యమాన్ని చూస్తోందన్నారు.
ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఏం పీకలేడు
కెసిఆర్ ఏకాకి అంటూ ఆంధ్రజ్యోతి దినపత్రిక ఎండి వేమూరి రాధాకృష్ణ తనపై వ్యక్తిగతంగా కథలు, కట్టు కథలు రాస్తున్నారని కేసిఆర్ మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంపై విషం చిమ్మే ఇలాంటి సీమాంధ్ర మీడియా, సీమాంధ్ర పత్రికలు తెలంగాణ ఉద్యమాన్ని ఏ మాత్రం తగ్గించలేవన్నారు.
వేమూరి రాధాకృష్ణా ఖబద్ధార్ .. తెలంగాణలో ఆంధ్రజ్యోతిని బహిష్కరించే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి అంటూ కేసిఆర్ చిందులు తొక్కారు. తాను ఒంటరో, రాధాకృష్ణ ఒంటరో ఒక సారి తెలంగాణ జిల్లాలకు వస్తే తెలుస్తుందన్నారు. ఇలాంటి కథలు, కట్టు కథలు రాసి రాధాకృష్ణ తన ఒక్క వెంట్రుక కూడా పీకలేడని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications