అది ఎక్స్పైరీ డేట్, కృష్ణ, కృష్ణంరాజులదీ విభజనే: హరీష్
తెలంగాణకు భారీ ప్యాకేజీ అని, విభజన జరిగితే నక్సలైట్ల పెరుగుతారని, జిల్లాకో మెడికల్ కళాశాల అని కిరణ్ చెప్పడం సరికాదన్నారు. ప్యాకేజీలతో ఉద్యమం అగదన్నారు. జిల్లాకో మెడికల్ కళాశాల అంటున్న కిరణ్ ఇన్నాళ్లు ఏం చేశారని ప్రశ్నించారు. విభజన జరిగితే ఇందిరమ్మ బాధపడుతుందంటూ.. తెలంగాణను అడ్డుకునే ప్రయత్నాలను సీమాంధ్ర నేతలు చేస్తున్నారన్నారు.
సీమాంధ్ర నేతల ప్రయత్నాలను అడ్డుకోవాల్సి ఉందన్నారు. పంచాయతీ ఎన్నికలలో తెరాసను మెజార్టీ సీట్లలో గెలిపించాలన్నారు. లేదంటే తెలంగాణవాదం లేదని ప్రచారం చేస్తారన్నారు. అందరూ తెలంగాణవాదులమేనని ఇప్పుడు ఓట్ల కోసం వస్తారని, తెరాసకు తక్కువొస్తే మాత్రం తెలంగాణవాదం పోయిందంటారన్నారు.
పంచాయతీ ఎన్నికల్లో గెలిచేందుకు పలు పార్టీలు డబ్బులు పంచుతున్నాయని ఆరోపించారు. అత్యధిక స్థానాలలో తెరాసను గెలిపించాలన్నారు. సీమాంధ్ర నేతలు అధిష్టానానికి తప్పుడు నివేదికలు ఇస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ఇస్తే నక్సలిజం రాదని, సమైక్యంగా ఉంటేనే పుట్టుకు వస్తుందన్నారు.
తెలంగాణకు ప్యాకేజీ అంటే గడువు ముగిసిన మందులాంటిదన్నారు. తెరాసను బలహీనపర్చేందుకు సీమాంధ్ర పార్టీలు కుట్ర పన్నుతున్నాయన్నారు. తెరాసను అడ్డుకునేందుకు కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు, టిడిపిలు ఒక్కటవుతున్నాయన్నారు. తెలంగాణ ఇస్తే రాజీనామా చేస్తామని జగన్ పార్టీ వారు హెచ్చరిస్తున్నారన్నారు.
ఉండవల్లికి కౌంటర్
ఉండవల్లి తెలంగాణపై మరోసారి విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. విశాఖ వెనుకబడిందని ఆయన చెబుతున్నారని కానీ, ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న వాటిల్లో విశాఖ ఉందన్నారు. 1972లోనే విభజన జరిగితే రెండు ప్రాంతాలు అభివృద్ధి చెందేవన్నారు. విభజన ద్వారా తెలంగాణే కాకుండా సీమాంధ్ర కూడా అభివృద్ధి చెందుతుందన్నారు.
తెలంగాణపై విస్తృత చర్చ జరగాలని ఉండవల్లి అంటున్నారని, అరవై ఏళ్లుగా చర్చ జరుగుతూనే ఉందని, ఎప్పుడు చర్చ జరగలేదో చెప్పాలన్నారు. విభజన జరగకపోవడం వల్ల తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాలు యాభై ఏళ్లు వెనక్కు వెళ్లిపోయిందన్నారు. ఉండవల్లి అనవసర రాద్ధాంతం చేయవద్దన్నారు.
ఉండవల్లి సమైక్యవాది కాదు, వేర్పాటువాది కాదని, అవకాశవాది అన్నారు. ఒకవేళ విశాఖ అభివృద్ధి చెందలేదంటే అది సీమాంధ్ర నేతల వల్లే అన్నారు. ఉండవల్లి ఓ ఊసరవెల్లి అని మండిపడ్డారు. 1973లో సినీ హీరోలు కృష్ణ, కృష్ణం రాజులు కూడా విభజననే కోరుకున్నారన్నారు.