ప్రభుత్వానికి భయం, వైయస్ అంటే భరోసా: విజయమ్మ
నాడు వైయస్ హయాంలో ఉద్యమంలా ఫీజు పథకం ఉండేదని, అదో విప్లవమని, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం మాత్రం నిర్లక్ష్యం వహిస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలోని ఏ ఒక్క ప్రాంతానికి కూడా ప్రభుత్వం న్యాయం చేసే పరిస్థితిలేదని దుయ్యబట్టారు. అందుకే తాము ప్రభుత్వ విధానాలపై పోరాటం చేస్తున్నట్లు చెప్పారు. విద్యార్థులకు చెల్లించే ఫీజు ఎగ్గొట్టటానికి సర్కారే ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలులో గందరగోళం సృష్టిస్తోందని ఆరోపించారు.
వైయస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి విద్యార్థి చదువుకు భరోసా ఇచ్చారని, వారి ఫీజు మొత్తాన్ని ప్రభుత్వం ద్వారా చెల్లించారని చెప్పారు. ఆయన చనిపోయాక అసలు ఫీజు రీయింబర్స్మెంట్ ఉంటుందా? ఉండదా? అనే అనుమానం కలుగుతోందని పేర్కొన్నారు. కళాశాలల యాజమాన్యాలు వేధింపుల వల్లనే విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పారు.
వైయస్ అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు కళ్లుగా భావించారని, ప్రతి ఒక్కరి అవసరాలనూ దృష్టిలో ఉంచుకుని పథకాలు రూపొందించారని, అందుకే వైయస్ అంటే ఓ నమ్మకం, ఆశయం, భరోసా అని ప్రజలు భావించారన్నారు.