తాడోపేడో: విజయమ్మతో కొండా సురేఖ, టి నేతల భేటీ

విజయమ్మతో తెలంగాణ నేతలు రెండు రోజుల్లో మూడుసార్లు భేటీ కావడం చర్చనీయాంశమైంది. తెలంగాణపై పార్టీ నిర్ణయంపై స్పష్టమైన ప్రకటన చేయాలని వారు విజయమ్మను కోరుతున్నారని తెలుస్తోంది. తెలంగాణకు అనుకూలమంటే పార్టీలో ఉంటామని, సమైక్యగళం వినిపిస్తే తమ దారి తాము చూసుకుంటామని విజయమ్మకు టి నేతలు చెప్పినట్లుగా తెలుస్తోంది.
ప్లీనరీ తీర్మానానికి కట్టుబడి ఉన్నామని మాటల్లో చెబుతున్నా, చేతల్లో మాత్రం సమైక్యానికి అనుకూలంగా కనిపిస్తోందని, ఇది తమను తమ ప్రాంతాల్లో ఇబ్బందులకు గురి చేస్తోందని, తమ ప్రాంత ప్రజల మనోభావాలను కూడా గుర్తించాల్సిన అవసరముందని వారు విజయమ్మకు చెప్పినట్లుగా తెలుస్తోంది.
ఇప్పటికై పార్టీపై సమైక్య ముద్ర ఉందని, రాజీనామాలతో మరింత ప్రజల్లోకి వెళ్లిందని, వారిపై చర్యలు తీసుకుంటే తప్ప తాము పార్టీలో ఉండలేని పరిస్థితి ఉందని వారు తమ ఆవేదనను విజయమ్మ వద్ద చెప్పినట్లుగా తెలుస్తోంది. ప్లీనరీ ప్రకటనకు కట్టుబడి ఉన్నామని విజయమ్మ, ఇతర నేతలు చెప్పినప్పటికీ స్పష్టమైన ప్రకటన చేస్తే తప్ప తాము ఉండలేని పరిస్థితి అని ఖరాఖండిగా చెప్పారని అంటున్నారు.
అనుమానాలు నివృత్తి చేసుకునేందుకే...
ప్లీనరీ ప్రకటనకు తమ పార్టీ కట్టుబడి ఉందని ఆ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్ర రావు శనివారం చెప్పారు. తెలంగాణ నేతలు తమ పార్టీతోనే ఉన్నారన్నారు. తమ అనుమానాలను నివృత్తి చేసుకోవడానికే కొందరు టి నేతలు విజయమ్మతో భేటీ అయ్యారని చెప్పారు.












Click it and Unblock the Notifications