సమైక్యవాదం: విభజనకు వైయస్ జగన్ కొత్త ఫార్ములా
రాయలసీమ, కోస్తాంధ్రల్లో పార్టీ బలోపేతమే ధ్యేయంగా వైయస్ జగన్ తన వ్యూహాలకు పదును పెడుతున్నట్లు ఆ చానెల్ వ్యాఖ్యానించింది. పరోక్షంగా విభజనను వ్యతిరేకిస్తూనే, తప్పని పరిస్థితుల్లో తాము డిమాండ్ చేసినట్లుండాలన్న కొత్త వ్యూహాన్ని రూపొందించారు. మహబూబ్నగర్, దక్షిణ నల్లగొండ (నల్లగొండ పార్లమెంటు నియోజకవర్గం), ఖమ్మం జిల్లాలను, కరీంనగర్ జిల్లాలోని కొంత ఇంద్రావతి నదీపరివాహక ప్రాంతాన్ని రాయలసీమ, ఆంధ్ర ప్రాంతాలతో కలిపి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలన్న డిమాండ్ను ఆయన తెరపైకి తెస్తున్నట్లు ఆ వార్తాకథనం ప్రదర్శించారు. ఈ ప్రాంతాల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కాస్తా ఉనికిని ప్రదర్శించింది.
ఆంధ్రజ్యోతి వార్తాకథనం ప్రకారం - తన వాదనకు మద్దతుగా జల వివాదాలను, హైదరాబాద్ను తెర ముందుకు తెస్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రతిపాదిస్తున్న పద్ధతిలో (ఎగువ భాగం ఒక రాష్ట్రంగా, దిగువ భాగం ఒక రాష్ట్రంగా) విభజిస్తే భవిష్యత్తులో పెద్ద ఎత్తున జల యుద్ధాలు జరుగుతాయన్న ఆందోళనను ప్రజల్లో రేకెత్తించి, జల యుద్ధాలకు తావులేకుండా చేయాలంటే జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులు పూర్తిగా రాయలసీమ, ఆంధ్రా ప్రాంతంలోకి వచ్చేలా జగన్ ప్రతిపాదనలు తయారుచేశారు.
ఈ మేరకు కొత్త వ్యూహానికి ప్రత్యేక నోట్ రూపమిచ్చి, జైలులో తనను కలిసే పార్టీ ముఖ్య నేతలకు అందజేస్తున్నారని, ఆ నోట్ తమకు లభించిందని ఆంధ్రజ్యోతి మీడియా చెప్పింది. విభజన అనివార్యమైతే జల వివాదాలు, హైదరాబాద్పై స్పష్ట త ఇవ్వాలని సూచించారు. నీటికోసం తన్నుకునే పరిస్థితు లు రాకూడదంటే జూరాల, నాగార్జునసాగర్ ప్రాజెక్టులున్న జిల్లాలను ఆంధ్రా, రాయలసీమ ప్రాంతంలో కలపాలని జగన్ సూచిస్తున్నారు.
అలాగే, గోదావరి జలాలకు సంబంధించి నాసిక్ నుంచి వచ్చే పాయ, ప్రాణహితలను తెలంగాణకు, ఇంద్రావతి, శబరి ఆంధ్ర, రాయలసీమలకు చెందేలా చూడాలి. ఇక్కడ కచ్చితంగా రెండు ప్రాంతాలకు న్యాయం జరగాలంటే మహబూబ్నగర్, ఖమ్మం జిల్లాలు ఒకవైపు ఉండేలా చూడాలని, అలాగే, శ్రీశైలం, సాగర్ ఆయకట్టులో రోజువారీ గొడవల నివారణకు నల్లగొండ పార్లమెంట్ డివిజన్తోపాటు ఖమ్మం జిల్లా, ఆ కొద్దిపాటి ఇంద్రావతి నది, మహబూబ్నగర్ జిల్లాలు ఆంధ్రా ప్రాంతంలో ఉండేలా చూడాలని జగన్ ఆ నోట్లో చూపించారంటూ ఆంధ్రజ్యోతి రాసింది.
హైదరాబాద్ ఈ స్థాయికి రావడానికి 60 ఏళ్లు పట్టిందని, రాష్ట్ర ఆదాయంలో హైదరాబాద్దే 40 శాతం ఉందని జగన్ వివరించారు. అందువల్ల, హైదరాబాద్ విషయంలో సరైన పరిష్కారాన్ని చూపాలని ఆయన అభిప్రాయపడ్డారు. తెలుగు గంగ ద్వారా ఇప్పుడు చెన్నైకి నీళ్లు ఇస్తున్నట్లే హైదరాబాద్ మహా నగరానికీ కృష్ణా నీటి వాటా ఉండాలని సూచించారు.