1971 నుంచి పాక్ నగ్నరూపాన్ని ప్రపంచం ముందు పెట్టిన భారత్
ఐక్యరాజ్య సమితి (UN) వేదికగా భారతదేశం పాకిస్తాన్ వైఖరిపై అత్యంత ఘాటుగా విరుచుకుపడింది. అంతర్జాతీయ సమాజం ముందు పాక్ అసలు రంగును, దాని రక్తపాత చరిత్రను నగ్నంగా విప్పేసింది. మే 21, 2026న న్యూయార్క్లో జరిగిన ఐరాస భద్రతా మండలి (UNSC) వార్షిక బహిరంగ చర్చలో ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి, అంబాసిడర్ హరీష్ పర్వతనేని మాట్లాడారు. "సహాయుధ సంఘర్షణలో పౌరుల రక్షణ" అనే అంశంపై జరిగిన ఈ చర్చలో, సరిహద్దుల వెంబడి నిస్సహాయ పౌరులపై పాకిస్తాన్ సాగిస్తున్న అమానుష దాడులను ఆయన ఆధారాలతో సహా ప్రపంచం ముందు పెట్టారు.
భారతదేశ అంతర్గత విషయాలపై మాట్లాడే అర్హత పాకిస్తాన్కు ఎంతమాత్రం లేదని మండిపడ్డారు. సొంత ప్రజలపైనే బాంబులు వేసుకుని, పొరుగు దేశాల పౌరుల ప్రాణాలు తీసే 'మారణహోమ చరిత్ర' కలిగిన దేశం బుకాయించడాన్ని ఆయన తీవ్రంగా విమర్శించారు.

ఆఫ్ఘనిస్తాన్లో పాక్ వైమానిక దాడుల ఘోరం..
ఐక్యరాజ్యసమితి అసిస్టెన్స్ మిషన్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్ (UNAMA) నివేదికను ఉటంకిస్తూ హరీష్ పర్వతనేని పాక్ సైన్యానికి గుండెల్లో రైళ్లు పరిగెత్తించే గణాంకాలను బయటపెట్టారు. 2026 మొదటి మూడు నెలల్లోనే ఆఫ్ఘనిస్తాన్లో పాకిస్తాన్ జరిపిన వైమానిక దాడుల కారణంగా 750 మంది పౌరులు మరణించడం, తీవ్రంగా గాయపడటం జరిగిందని ఆయన వెల్లడించారు. ఆఫ్ఘన్ పౌరుల ప్రాణ నష్టానికి సంబంధించిన 95 సంఘటనలను పరిశీలిస్తే, అందులో 94 దారుణాలకు పాకిస్తాన్ భద్రతా దళాలే నేరుగా కారణమని ఐరాస నివేదిక స్పష్టం చేస్తోందని ధ్వజమెత్తారు.
🇮🇳 #IndiaAtUN।। Annual #UNSC Open Debate on ‘Protection of civilians in armed conflict’
— All India Radio News (@airnewsalerts) May 21, 2026
WATCH ⏩ India calls out Pakistan’s long-tainted record of genocide at the @UN Security Council. pic.twitter.com/jcGBjc4JvK
పవిత్ర రంజాన్ మాసంలో, ప్రజలంతా ప్రశాంతంగా ఉన్న సమయంలో కాబూల్లోని 'ఒమిడ్ అడిక్షన్ ట్రీట్మెంట్ ఆసుపత్రి'పై పాకిస్తాన్ క్రూరమైన వైమానిక దాడికి తెగబడిందని పర్వతనేని ఆరోపించారు. ఈ అమానుష దాడిలో 269 మంది అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోగా, 122 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఆసుపత్రి ఎటువంటి సైనిక స్థావరం కాదని స్వయంగా ఐరాస మిషనే నిర్ధారించిందని ఆయన గుర్తు చేశారు. ముస్లింలు తరావిహ్ ప్రార్థనలు ముగించుకుని మసీదుల నుండి బయటకు వస్తున్న తరుణంలో ఈ దాడులు జరగడం పాక్ కపటత్వానికి నిదర్శనమని మండిపడ్డారు.
94 వేల మంది నిర్వాసితులు.. 1971 నాటి చరిత్ర
పాకిస్తాన్ సాగిస్తున్న ఈ సరిహద్దు ఉగ్రవాదం, సాయుధ హింస కారణంగా ఇప్పటివరకు 94,000 మందికి పైగా ఆఫ్ఘన్ పౌరులు తమ ఇళ్లను వదిలి ప్రాణభయంతో నిర్వాసితులుగా మారారని పర్వతనేని ఆవేదన వ్యక్తం చేశారు. పౌర రక్షణపై ఐరాస సెక్రటరీ జనరల్ పదే పదే చేస్తున్న విజ్ఞప్తులను, అంతర్జాతీయ మానవతా బాధ్యతలను పాక్ పూర్తిగా తుంగలో తొక్కిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పాకిస్తాన్ సైన్యానికి దశాబ్దాలుగా ఉన్న వికృత బుద్ధిని గుర్తుచేస్తూ.. 1971 బంగ్లాదేశ్ విముక్తి యుద్ధం నాటి "ఆపరేషన్ సర్చ్లైట్" దారుణాలను ఆయన ప్రస్తావించారు. ఆ సమయంలో పాక్ సైన్యం ఏకంగా 4,00,000 (నాలుగు లక్షల) మంది మహిళా పౌరులపై అత్యంత క్రూరంగా సామూహిక అత్యాచారాలు, మారణహోమానికి పాల్పడిందని నొక్కి చెప్పారు. ఎలాంటి విశ్వాసం, చట్టం, కనీస నైతికత లేని పాకిస్తాన్ చేస్తున్న తప్పుడు ప్రచారాలను ప్రపంచ దేశాలు సులభంగా గుర్తించగలవని ఆయన అన్నారు.
అంతర్జాతీయ శాంతి కోసం భారత్ పిలుపు..
సంఘర్షణ ప్రాంతాల్లో ఆసుపత్రులు, పాఠశాలలు, పౌరులు, మానవతా కార్యకర్తలపై జరుగుతున్న దాడులపై భారతదేశం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అంతర్జాతీయ శాంతి, భద్రతలను కాపాడటంలో పౌరుల రక్షణే ఐరాస భద్రతా మండలి ప్రయత్నాలకు కేంద్ర బిందువుగా ఉండాలని భారత్ స్పష్టం చేసింది. అంతర్జాతీయ మానవతా చట్టాన్ని గౌరవిస్తూ, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించే ఉగ్రవాద మద్దతు దేశాలపై జవాబుదారీతనాన్ని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. మారుతున్న కాలంలో అభివృద్ధి చెందుతున్న సరికొత్త సాంకేతికతలను కూడా పౌరుల బాధలను తగ్గించేందుకు బాధ్యతాయుతంగా ఉపయోగించాలని కోరుతూ భారత రాయబారి తన ప్రసంగాన్ని ముగించారు.












Click it and Unblock the Notifications