ముందే ఊహించా: టిపై లగడపాటి, రాయపాటి రిజైన్
తాను దీనిని ముందే ఊహించానన్నారు. తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీల వైఖరి నేపథ్యంలోనే అధికార పార్టీ ఈ నిర్ణయం తీసుకుందన్నారు. ఇప్పటికైనా రాష్ట్రం సమైక్యంగానే ఉంటుందని తాను గట్టిగా నమ్ముతున్నానని చెప్పారు. సీమాంధ్ర ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరూ రాజీనామాలు చేయవద్దన్నారు.
రాజీనామా చేస్తే చట్ట సభల్లో సీమాంధ్ర బలం తగ్గుతుందన్నారు. నేతలు రాజీనామా చేయకుండా చట్టసభల్లో సమైక్యవాణిని గట్టిగా వినిపించాలని కోరారు. రాష్ట్రం కచ్చితంగా సమైక్యంగానే ఉంటుందన్నారు. పార్టీలకతీతంగా అసెంబ్లీలో తెలంగాణ తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేయాలన్నారు. ప్రజాస్వామ్యానికి సంఖ్యాబలమే ఊపిరి అన్నారు. అసెంబ్లీలో, పార్లమెంటులో సమైక్య సత్తా చాటుతామని చెప్పారు.
కొత్త రాజధాని ఏర్పాటు బాధ్యత కేంద్రానిదే: యనమల
కొత్త రాజధాని ఏర్పాటు బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని తెలుగుదేశం పార్టీ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. కాంగ్రెసు పార్టీ ఈ నిర్ణయాన్ని ఒత్తిడిలో తీసుకోవచ్చునని అన్నారు.
సిడబ్ల్యుసి తెలంగాణ అనుకూల ప్రకటనపై గుంటూరు కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివ రావు తీవ్రంగా ప్రతిస్పందించారు. తెలంగాణ అనుకూల ప్రకటనను నిరసిస్తూ ఆయన లోకసభ సభ్యత్వానికి, కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేశారు.