జై తెలంగాణ: సిడబ్ల్యూసి ఏకగ్రీవం, టిలో సంబరాలు
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సిడబ్ల్యూసి మంగళవారం ఏకగ్రీవంగా ఆమోదించింది. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ నివాసంలో సిడబ్ల్యూసి భేటీ అయింది. ఈ భేటీలో తెలంగాణపై ఏకవ్యాక్య తీర్మానం చేశారు. దానిని సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. సమావేశం గంటపాటు సాగింది. అంతకుముందే యూపిఏ తెలంగాణకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.
యూపిఏ, సిడబ్ల్యూసి తీర్మానాల నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోనుంది. అరవయ్యేళ్ల తెలంగాణ ఉద్యమం ఫలితంగా అధికార కాంగ్రెసు పార్టీ జూలై 29, 2013న చారిత్రక నిర్ణయం తీసుకుంది. దేశంలో తెలంగాణ రాష్ట్రం 29వది కానుంది. హిందీ కాకుండా విభజించబడిన తొలి భాషాప్రయుక్త రాష్ట్రం ఎపి.

- హైదరాబాద్ బయల్దేరిన కిరణ్
సిడబ్ల్యూసి భేటీ అనంతరం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హైదరాబాద్ బయలుదేరారు.
- సిఎల్పీకి తెలంగాణ కాంగ్రెసు నేతలు
తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలు సిఎల్బీకి చేరుకుంటున్నారు.
- గన్పార్క్కు కెసిఆర్
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు గన్పార్క్కు చేరుకోనున్నారు.
తెలంగాణలో సంబరాలు
తెలంగాణకు యూపిఏ, ఏఐసిసి అనుకూలంగా నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో తెలంగాణవాదులు బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకుంటున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయ, కాకతీయ విశ్వవిద్యాలయాలు, తెలంగాణ విద్యార్థుల ఆనందం అంబరాన్ని అంటింది.












Click it and Unblock the Notifications