మళ్లీ వైయస్ సాకు: అసెంబ్లీలో టీ తీర్మానానికి నో
హైదరాబాద్: రాష్ట్ర విభజనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం శాసనసభ తీర్మానం అవసరం లేదనే భావనలో ఉన్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ తీర్మానం లేకుండానే ముందుకు సాగడానికి దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి శాసనసభలో చేసిన ప్రసంగాన్ని సాకుగా చూపే అవకాశాల కోసం చూస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర విభజనకు దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీకి 42 మంది తెలంగాణ శాసనసభ్యులు సమర్పించిన వినతిపత్రాన్ని సాకుగా చూపుతున్న కేంద్ర ప్రభుత్వం శాసనసభ తీర్మానాన్ని పక్కన పెట్టడానికి కూడా ఆయన వ్యవహారాన్నే వాడుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు శాసనసభ తీర్మానాన్ని అడగాలా, వద్దా అనే విషయంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోనప్పటికీ దాన్ని పక్కన పెట్టే మార్గాలు వెతుకుతున్నట్లు తెలుస్తోంది. గురువారం కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే చెప్పిన మాటలను బట్టి ఆ విషయం అర్థమవుతోంది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తిరుగుబాటు ప్రకటంనప్పటికీ, సీమాంధ్ర రాష్ట్ర మంత్రులు, శాసనసభ్యులు రాజీనామాలు చేస్తున్న నేపథ్యంలో శాసనసభ తీర్మానం అవసరం లేకుండానే ముందుకు సాగాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.

తెలంగాణ అంశంపై ఇది వరకే శాసనసభలో చర్చ జరిగిందని, రాష్ట్ర అసెంబ్లీ నుంచి ముందస్తు తీర్మానం అనివార్యం కాదని షిండే చెప్పారు. సూత్రప్రాయంగా మంత్రి వర్గ ఆమోదం, విభజనకు సంబంధించిన పద్ధతులను రూపొందించడానికి మంత్రుల గ్రూపును ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్ర ఏర్పాటును త్వరగా పూర్తి చేయవచ్చునని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.
రాష్ట్ర శాసనసభ తీర్మానం చేయలానే సాధారణ పద్ధతిని పక్కన పెడుతున్నారా అని అడిగితే కొత్త రాష్ట్రం ఏర్పాటు చేయడానికి సాధారణ పద్ధతుల్లో 8 నుంచి 10 నెలలు పడుతుందని, అయితే తాము ఆరు నెలల్లో పూర్తి చేయాలని అనుకుంటున్నామని ఆయన జవాబిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును ప్రస్తుత వర్షాకాలం సమావేశంలో ప్రతిపాదించే అవకాశాలు లేవని, శీతాకాలం సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశాలున్నాయని ఆయన చెప్పారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు హామీ ఇస్తూ వైయస్ రాజశేఖర రెడ్డి 2009 ఫిబ్రవరి 12వ తేదీన చేసిన ప్రసంగంపై కేంద్రం ఆధారపడాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. శానససభలో తెలంగాణపై సుదీర్ఘమైన చర్చ జరిగింది. ఏకగ్రీవ అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేసింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ముందుకు తీసుకుని వెళ్లడానికి వైయస్ రాజశేఖర రెడ్డి ప్రకటనపై ఆధారపడదలుచుకున్నట్లు చెబుతున్నారు.
నిజానికి, కేంద్ర మంత్రివర్గ ఆమోదం తర్వాత తీర్మానం కోసం ఆగస్టు మొదటి వారం లేదా రెండో వారంలో పంపించాలని రెండు రోజుల క్రితం కాంగ్రెసు అధిష్టానం అనుకుంది. రాష్ట్ర శాసనసభలో సీమాంధ్ర శాసనసభ్యులు ఎక్కువ మంది ఉండడం వల్ల ఏ ముఖ్యమంత్రి కూడా తీర్మానం ఆమోదం పొందడానికి అవసరమైన చర్యలను తీసుకోలేరనే భావన ముందుకు వచ్చింది. దీంతో మంత్రుల గ్రూప్ను ఏర్పాటు చేయడంతో ముందుకు సాగాలని కేంద్ర ప్రభుత్వం అనుకుంటోంది. తనను కలిసిన సీమాంధ్ర కేంద్ర మంత్రులతో అదే విషయం చెప్పారు. అభ్యంతరకరమైన అంశాలపై మంత్రుల గ్రూప్ అధ్యయనం చేస్తుంది.
రాష్ట్రపతికి పంపించడానికి ముందే రాష్ట్ర శాసనసభలో తీర్మానం వీగిపోతే తప్పు సంకేతాలు వెళ్తాయని ఉద్దేశంతో కాంగ్రెసు అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. దానివల్ల రాష్ట్ర శాసనసభ తీర్మానం అవసరం లేకుండా ముందుకు సాగేందుకు ఉన్న మార్గాలపై కేంద్ర ప్రభుత్వం న్యాయనిపుణులను సంప్రదిస్తోంది. నేరుగా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ను ఏర్పాటు చేసే విషయంపై ఆలోచన చేస్తోంది.












Click it and Unblock the Notifications