తెలంగాణను అడ్డుకోవడం లేదు: విజయమ్మ, కంటతడి
రాష్ట్రంలో కుమ్మక్కు రాజకీయాలు నడుస్తున్నాయని వైయస్ విజయమ్మ ఆరోపించారు. జగన్ను కుట్రపూరితంగా జైలులో పెట్టించారని, షర్మిల అన్న కోసం సుదీర్ఘ పాదయాత్ర చేశారని విజయమ్మ ఉద్వేగానికి లోనై కంటతడి పెట్టారు. తెలుగుదేశం, కాంగ్రెసు కుమ్మక్కై జగన్ను జైలులో పెట్టించిందన్నారు. షర్మిలను వైయస్ ఎంతో అపురూపంగా పెంచుకున్నారని కానీ, ఆమె అన్న కోసం వేల కిలోమీటర్లు ఎండలో, వానలో నడిచిందన్నారు.
షర్మిల పాదయాత్రతో ప్రజల అనుబంధం పెరిగిందన్నారు. ఇది రికార్డుల కోసం చేసిన పాదయాత్ర కాదన్నారు. ప్రజలకు మంచి రోజులు వస్తాయని చెప్పేందుకే ఈ పాదయాత్ర అన్నారు. వైయస్ అన్న పదం రాజకీయాల్లో కొత్త అర్థం చెప్పిందని, అది భవిష్యత్తు తరాలకు దారి చూపుతుందన్నారు. వైయస్ అంటే ఓ నమ్మకం, వైయస్ అంటే ఓ భరోసా అన్నారు. షర్మిలను పులిబిడ్డ అని ప్రజలు అంటుంటే కష్టాలను మర్చిపోయానన్నారు. ప్రజలు జగన్ దగ్గరకు రాకుండా ఏ జైలు గోడలు అడ్డుకావన్నారు.
కెసిఆర్ అప్పుడే వెళ్లమంటున్నారు
వైయస్ అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేశారన్నారు. హైదరాబాదులో ఎంతో అభివృద్ధి జరిగిందన్నారు. వైయస్లా సమన్యాయం జరిగితే విభజనకు ఆస్కారం ఉండకపోయేదన్నారు. తాము తెలంగాణను అడ్డుకోవడం లేదని అయితే, సీమాంధ్ర ప్రజలకు అన్యాయం జరగవద్దని తాము కోరుతున్నామన్నారు. విభజన జరగకుండానే తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు సీమాంధ్ర ఉద్యోగులను వెళ్లిపోమంటున్నారని ఆరోపించారు.
జగన్ను ఎదుర్కోలేకే: మేకపాటి
జగన్ను రాజకీయంగా ఎదుర్కోలేకనే కాంగ్రెసు పార్టీ రాష్ట్ర విభజనకు పచ్చజెండా ఊపిందని నెల్లూరు పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. విభజన నిర్ణయానికి ముందు అన్ని ప్రాంత ప్రజలతో మాట్లాడాల్సి ఉండెనన్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా తాను సోమవారం పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు.
పాదయాత్ర
షర్మిల గతేడాది అక్టోబర్ 18న కడప జిల్లా ఇడుపులపాయ నుండి మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రను ప్రారంభించారు. ఈ రోజు శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ముగించారు. 14 జిల్లాలలోని 116 నియోజకవర్గాలను చుట్టి వచ్చారు. 230 రోజులు 3,112 కిలోమీటర్లు నడిచారు. 2250 గ్రామాల మీదుగా ఆమె నడక సాగించారు. షర్మిల ఇచ్ఛాపురంలో మరో ప్రజా ప్రస్థానం పైలాన్ను ఆవిష్కరించారు.