విభజన: జెడి శీలం, పాల్వాయి మధ్య వాగ్వాదం
సీమాంధ్రులు తెలంగాణానుంచి వెళ్లిపోవాలని పాల్వాయి వ్యాఖ్యానించడాన్ని సీమాంధ్రకు చెందిన మంత్రి జేడీ శీలం తీవ్రంగా ఆక్షేపించారు. ఆ మాట చాలా ఆక్షేపణీయం అని ఆయన గట్టిగా చెప్పారు. ఆయనకు మద్దతుగా రేణుకా చౌదరి కూడా ముందుకు వచ్చారు. ఇది సభలో కొంత గందరగోళ పరిస్థితికి దారి తీసింది. సీమాంధ్రకు చెందిన సభ్యులు కొందరు మంత్రి శీలంకు మద్దతుగా నిలిచారు.
పరిస్థితి తీవ్ర రూపం దాల్చకుండా అంబికా సోని జోక్యం చేసుకుంటూ మంత్రిని ఇలా ఎదురుపడి వాగ్వాదానికి దిగడం సరి కాదని హితవు చెప్పినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత కొంత సేపటికి సభలో ప్రశాంత వాతావరణం నెలకొన్నది.
సమైక్యంగా ఉంచాలని చెప్పాం
రాష్ట్ర విభజన వద్దని, సమైక్యంగా ఉంచాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి విజ్ఞప్తి చేశామని కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన ఆధ్వర్యంలో కర్నూల్ జిల్లా నేతలు సోనియాను పార్లమెంట్లో కలుసుకున్నారు. అనంతరం కోట్ల మీడియాతో మాట్లాడారు. మేడమ్ ముందు మూడు ప్రతిపాదనలు పెట్టామని అన్నారు.
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని, లేదంటే ప్రత్యేక రాయలసీమ ఏర్పాటు చేయాలని, కర్నూలును రాజధాని చేయాలని సోనియాకు విజ్ఞప్తి చేసినట్లు కోట్ల తెలిపారు. దీనిపై స్పందించిన సోనియా మీ సమస్యలన్నీ తెలుసునని, దీనిపై అత్యున్నత కమిటి వేసినట్లు చెప్పారని కోట్ల తెలిపారు. మీ సమస్యలన్నీ కమిటీకి తెలియజేయాలని మేడమ్ సూచించినట్లు ఆయన చెప్పారు.
కేంద్రమంత్రులు ఏకె ఆంటోని, దిగ్విజయ్ సింగ్, అహ్మద్ పటేల్, వీరప్ప మొయిలీలు నలుగురు సభ్యులతో కూడిన కమిటీ ఏర్పాటు చేసినట్లు సోనియా తెలిపారని కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి చెప్పారు.