టి ఓకే, సీమాంధ్రులకు హామీలేంటి?: కాంగ్రెస్కు మోడీ
తెలంగాణ అంశంలో కాంగ్రెసు పార్టీ, యూపిఏ ప్రభుత్వ ఎన్నడు పారదర్శకంగా వ్యవహరించలేదన్నారు. ప్రజలను ప్రతిసారి మోసం చేస్తూ వస్తున్న కాంగ్రెసును, యూపిఏ ప్రభుత్వాన్ని ఈసారి కూడా నమ్మలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ నెల 11న హైదరాబాదులో జరిగే నవభారత యువభేరీ సభలో తన అభిప్రాయాలను పంచుకుంటానని పేర్కొన్నారు.
తాము తెలంగాణకు కట్టుబడి ఉన్నామని అయితే, మరో ప్రాంతానికి అన్యాయం చేసే ఉద్దేశ్యం తమకు లేదన్నారు. ఈ సమయంలో ఆయన కాంగ్రెసు, యూపిఏ ప్రభుత్వానికి కొన్ని ప్రశ్నలు సంధించారు. తెలంగాణ విషయంలో కాంగ్రెసులో ఏకాభిప్రాయ సాధనకు ఏం ప్రయత్నం చేశారని, కేంద్ర ప్రభుత్వం లోపల, వివిధ పార్టీల మధ్య ఈ విషయంలో చేసిన కృషి ఏమిటని ప్రశ్నించారు.
తెలంగాణను స్వాగతించే విషయంలో సీమాంధ్రులను సంసిద్ధుల్ని చేసేందుకు తీసుకున్న నిర్మాణాత్మక చర్యలేమిటని, వారి ఉపశమనానికి ఏం చర్యలు తీసుకున్నారని, ప్రజల మధ్య ఏకాభిప్రాయాన్ని కల్పించే మీ పొలిటికల్ రోడ్ మ్యాప్ ఎక్కడ అని, ఇది సాంకేతిక ప్రక్రియే అన్నట్లుగా తాము వింటున్నామన్నారు.
హైదరాబాద్ ఉమ్మడి రాజధాని పైన పలు అనుమానాలు వ్యక్తం చేశారు. చిన్న రాష్ట్రాలకు కట్టుబడిన ఏకైక పార్టీ బిజెపి అని, అన్ని ప్రాంతాల ప్రజలకు న్యాయం జరిగే విధంగా రోడ్ మ్యాప్ ఉండాలన్నదే బిజెపి విధానమన్నారు.