విభజన: రాజ్యసభలో సొమ్మసిల్లిన టిడిపి సిఎం రమేష్
ఆంధ్ర ప్రదేశ్ను కాపాడాలని, తమ ప్రాంత ప్రజలకు న్యాయం చేయాలని సిఎం రమేష్, సుజనా చౌదరిలు రాజ్యసభలో పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. వారు వెల్లోకి చొచ్చుకుపోయారు. నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ఈ సమయంలో సిఎం రమేష్ సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో డిప్యూటీ చైర్మన్ సభను పది నిమిషాల పాటు వాయిదా వేశారు.
డిజిపిపై జూపల్లి ఫైర్
డిజిపి దినేష్ రెడ్డి సమైక్యవాద పక్షపాతిగా వ్యవహరిస్తున్నారని, ప్రభుత్వం తక్షణం ఆయనను సస్పెండ్ చేయాలని తెలంగాణ రాష్ట్ర సమితి నేత జూపల్లి కృష్ణా రావు హైదరాబాదులో డిమాండ్ చేశారు. తెలంగాణ కోసం కాంగ్రెసు నేతలు చేసిందేమీ లేదన్నారు. కాంగ్రెసులో తెరాసను విలీనం చేయకూడదన్ది తన వ్యక్తిగత అభిప్రాయమన్నారు. తదుపరి కార్యాచరణపై ఈ రోజు సాయంత్రం సమావేశమై తెలియజేస్తామన్నారు.
ఆ పార్టీలు బలంగా ఉన్నచోటే.. యాష్కీ
సీమాంధ్రల ఉద్యమంలో రాజీవ్ గాంధీ, ఇందిరా గాంధీ విగ్రహాలను కూల్చడం, కాల్చడం సరికాదని నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు మధుయాష్కీ వేరుగా అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు బలంగా ఉన్నచోటనే ఈ కూల్చివేత జరిగిందన్నారు. హైదరాబాదులోని సీమాంధ్రులు తెలంగాణ ఏర్పడ్డాక కూడా ఇక్కడే నిరభ్యంతరంగా ఉండవచ్చునన్నారు.