హైదరాబాద్, భద్రాచలంలు వదిలేది లేదు: వంగా గీత
మంత్రి గల్లా అరుణ కుమారి సమైక్యాంధ్రకు మద్దతుగా వేదాంతపురం వద్ద బైక్ ర్యాలీని ప్రారంభించారు. సమైక్యాంధ్ర కోసం తానెప్పుడో రాజీనామా చేశానని, ఉన్నతస్థాయి కమిటీపై ఆశాభావంతో ఉన్నానని చెప్పారు. తూర్పు గోదావరి జిల్లాలో ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్ రెడ్డి మున్సిపల్ ఉద్యోగుల దీక్షా శిబిరంలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతుండగా ఉద్యోగులు అడ్డుకున్నారు. ప్రజాప్రతినిధులు అందరు మొదట రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణతో పెద్ద మొత్తంలో ఉద్యోగాలు వస్తాయని చెప్పడం సరికాదని కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత ఆమోస్ వేరుగా అన్నారు. నాయకులు ప్రజలకు మేలు చేయాలని కాని నష్టం కాదన్నారు. తెలంగాణ ఏర్పడినా లక్ష ఉద్యోగాలు అసాధ్యమన్నారు. ఇరు ప్రాంత నేతలు సంయమనం పాటించాలని కోరారు.
కాగా, బుధవారం రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి మాట్లాడుతూ.. భద్రాచలం డివిజన్ ముమ్మాటికీ ఖమ్మం జిల్లాలోనే ఉంటుందని, ఎవరెన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా చెల్లవని అన్నారు. కొంతమంది తూర్పు గోదావరి జిల్లాలోకి భద్రాచలం డివిజన్ను మార్చాలని చేస్తున్న ప్రయత్నాలు సరికాదన్నారు.
మరోవైపు భద్రాచలాన్ని ప్రత్యేక జిల్లాగా ప్రకటించి ఆంధ్ర ప్రాంతంలో కలపాలని భద్రాచలం పరిరక్షణ సమితి బుధవారం డిమాండ్ చేసింది. ఈ సమితి ఆధ్వర్యంలో స్థానిక క్షత్రియ సత్రంలో ఆదివాసీ సంఘ నాయకులతో బుధవారం ముఖ్య సమావేశం నిర్వహించారు. గతంలో ఆంధ్రలో ఉన్న భద్రాచలంను పరిపాలన సౌలభ్యం కోసం తెలంగాణలో కలిపారని పరిరక్షణ సమితి కన్వీనరు పీవీఎస్ వర్మ చెప్పారు.
ఏజెన్సీ అభివృద్ధి చెందాలంటే భద్రాచలం జిల్లాను ఏర్పాటు చేసి ఆంధ్రలో కలపాలన్నారు. అప్పటివరకు సంతకాల సేకరణ, ధర్నా కార్యక్రమాలు చేపడతామన్నారు. కాగా ఈ భేటీని తెలంగాణవాదులు అడ్డుకున్నారు. భద్రాచలం ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలోనే ఉంటుందని తెలంగాణవాదులు స్పష్టం చేశారు. విషయం తెలుసుకున్నపోలీసులు ఇరువర్గాలను పోలీస్స్టేషన్కు తరలించారు.