తెలంగాణ ప్రక్రియ ఆగలేదు, సిఎం విధేయుడు: డిగ్గీ
తెలంగాణపై కాంగ్రెసు వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యుసి) తీసుకున్న నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాల్సిందేనని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి విధేయుడైన కాంగ్రెసు వ్యక్తి అని, కిరణ్ కుమార్ రెడ్డితో తాను మాట్లాడుతానని ఆయన అన్నారు. ఆంటోనీ కమిటీ మంగళవారం నుంచి పనిచేస్తుందని ఆయన చెప్పారు. ఆంటోనీ కమిటీకి కాలపరిమితి లేదని దిగ్వజయ్ సింగ్ సోమవారం నాడు చెప్పారు.
సీమాంధ్ర నాయకుల అభ్యంతరాలను వినడానికి కాంగ్రెసు అధిష్టానం నలుగురు సభ్యులతో ఆంటోనీ నేతృత్వంలో కమిటీ వేసిన విషయం తెలిసిందే. సీమాంధ్ర కేంద్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు, రాష్ట్ర నాయకులు విభజనపై అపోహలను వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఆంటోనీ కమిటీని వేయడానికి కాంగ్రెసు అధిష్టానం నిర్ణయించింది.
అభ్యంతరాలను ఆంటోనీ కమిటీకి వినిపించాలని సీమాంధ్ర నాయకులకు ఇటీవల కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ సూచించారు. ఆంటోనీ కమిటీ ఏర్పాటు జరుగుతున్నందున తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ఆగిపోతుందని కేంద్ర మంత్రి పళ్లంరాజు ఆశాభావం వ్యక్తం చేయగా, ఆంటోనీ కమిటీ ఏర్పాటుతో విభజన ప్రక్రియ ఆగిపోయిందని విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ ఇటీవల చెప్పారు.