అసమర్థత కాదు: ఈటెల, భర్తల్ని అడగాలని భార్యలకు..
కిరణ్ సీమాంధ్రకే ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారన్నారు. కిరణ్ పైన తెలంగాణ ప్రాంత ప్రజలకు విశ్వాసం లేదని, ఆయనకు పాలించే హక్కు లేదన్నారు. ఇరు ప్రాంత ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టవద్దన్నారు. సీమాంధ్రులు తమను ఎంత రెచ్చగొట్టినా తాము శాంతియుతంగానే ఉంటామన్నారు.
తెలంగాణపై మంత్రివర్గం త్వరగా తీర్మానం చేయాలనే డిమాండుతో ఆగస్టు 17 నుండి శాంతిర్యాలీలు నిర్వహిస్తామని తెలంగాణ రాజకీయ ఐకాస చైర్మన్ ఆచార్య కోదండరామ్ అన్నారు. 17న ఇందిరా పార్కు వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు చెప్పారు. నెలాఖరున హైదరాబాదులో శాంతిర్యాలీ నిర్వహిస్తామన్నారు. తెలంగాణ ఆకాంక్షకు సీమాంధ్ర నేతలు అడ్డుపడటం సరికాదన్నారు. ఎన్ని కుట్రలు చేసినా రాష్ట్ర ఏర్పాటు ఆగదన్నారు.
సీమాంధ్ర ఉద్యోగుల సమ్మె రాజ్యాంగ విరుద్ధమన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నోటీసులు ఇస్తామన్నారు. సీమాంధ్ర ప్రాంతం వెనుకబాటుకు సీమాంధ్ర నేతలే కారణమన్నారు. ఆ విషయంలో సీమాంధ్ర ప్రాంత మంత్రులను వారి భార్యలే నిలదీయాలని సూచించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ మంత్రులు, ఎమ్మెల్యేల భార్యలు గవర్నర్ను కలిసి విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.