సేవ్ ఎపి టీషర్ట్స్తో సభకు ఎంపిలు, వైయస్పై సోమిరెడ్డి
న్యూఢిల్లీ/హైదరాబాద్: సేవ్ ఆంధ్రప్రదేశ్ అని రాసి ఉన్న టి షర్టులతో సీమాంధ్ర తెలుగుదేశం పార్టీ ఎంపీలు మంగళవారం లోకసభలో నిరసన తెలిపారు. ఉదయం పదకొండు గంటలకు ఉభయ సభలు ప్రారంభమయ్యాయి. రాజ్యసభలో విభజనపై నిరనస వ్యక్తం చేస్తుండటంతో చైర్మన్ సభను మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు వాయిదా వేశారు.
టిడిపి ఎంపీలు లోకసభకు సేవ్ ఆంధ్రప్రదేశ్ అని రాసి ఉన్న టి షర్టులు ధరించి వచ్చారు. వారు సభలో రాష్ట్రాన్ని రక్షించాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. ప్లకార్డులను ప్రదర్శిస్తూ వారు వెల్లోకి వెళ్లారు. టిడిపి సభ్యుల ఆందోళనల మధ్యనే స్పీకర్ ప్రశ్నోత్తరాలను చేపట్టారు.

సోమిరెడ్డి మండిపాటు
దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి పెట్టిన చిచ్చు రాష్ట్రాన్ని నాశనం చేస్తోందని మాజీ మంత్రి, టిడిపి నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హైదరాబాదులో మండిపడ్డారు. ప్రజలను కాంగ్రెసు పార్టీ రెచ్చగొడుతోందన్నారు. ఎపి రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ నియంతలా వ్యవహరిస్తున్నారని, ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ వేదాంతం మాట్లాడతారని, అధినేత్రి సోనియా గాంధీ ఒక్క ముక్క మాట్లాడరని విమర్శించారు.
వైయస్ నుండి నేటి వరకు కాంగ్రెసు పార్టీ రాష్ట్రాన్ని నాశనం చేస్తోందన్నారు. సమ్మెకు కేంద్రమే బాధ్యత వహించాలన్నారు. రాజధాని, హక్కులు, నిధుల గురించి మాట్లాడకుండా విభజిస్తే ఎలా అని ప్రశ్నించారు. తాము విభజనకు వ్యతిరేకం కాదని అయితే, సీమాంధ్ర హక్కులు కాపాడాలన్నారు. హైదరాబాదుపై డిగ్గీ రోజుకో విధంగా మాట్లాడుతున్నారన్నారు. కేంద్రమంత్రి చిదంబరం మళ్లీ మొదటకొచ్చారని విమర్శించారు.
సీమాంధ్ర ప్రజల హక్కులపై ఎందుకు మాట్లాడటం లేదన్నారు. సమ్మె చేస్తే హైదరాబాద్ వదిలి వెళ్లాలా అని జెఏసిని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు లేదా అన్నారు. సకల జనుల సమ్మె చేస్తే ఎవరూ మాట్లాడలేదన్నారు. రాష్ట్ర విభజన తెరాస, టిజెఏసిలకు ఇష్టం లేదన్నారు. విభజన జరిగితే వారి పెత్తనం పోతుందనే ఆందోళన వారిలో కనిపిస్తోందన్నారు.












Click it and Unblock the Notifications