భావాద్వేగాలున్నై, ఐక్యత చెడొద్దు: విభజనపై బొత్స
హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో రాష్ట్రమంతా సున్నితాంశాలు, భావోద్వేగాలు నెలకొన్నాయని, ఈ నేపథ్యంలో అందరూ ఐక్యతతో మెలగాలని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. 67వ భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా ఆయన గురువారం గాంధీభవన్లో జాతీయ పతాకను ఆవిష్కరించి, ప్రసంగించారు.
ప్రజలకు ఆయన స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. గరీబీ హఠావో నినాదం స్ఫూర్తితో కాంగ్రెసు సంక్షేమ రంగాన్ని కొత్తపుంతలు తొక్కించిందని ఆయన అన్నారు. జాతీయ స్ఫూర్తితో సామరస్యం దెబ్బ తినకుండా వ్యవహరించాలని ఆయన రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు.
కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాందీ, ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెసు ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆలోచనలతో దేశం అన్ని రంగాల్లో ప్రగతిపథంలో దూసుకుని పోతోందని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, డిప్యూటీ ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, రాష్ట్ర మంత్రులు, పార్టీ ముఖ్య నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) పార్టీ కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ పార్టీ సీనియర్ నేత నాయని నర్సింహా రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. పార్టీ నేతలు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా రాష్ట్రపతి, ప్రధాని ప్రసంగాల్లో తెలంగాణ ప్రకటన లేకపోవడాన్ని ఆయన తప్పు పట్టారు.