మంత్రులతో పోరాటం: ఎపిఎన్జీవో, అరగుండుతో ఎమ్మెల్యే
హైదరాబాద్/గుంటూరు: తాము సీమాంధ్ర మంత్రులపై ప్రత్యక్ష పోరాటం చేస్తామని ఎపిఎన్జీవో ప్రకటించింది. గుంటూరులో శుక్రవారం ఎపిఎన్జీవోలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు అశోక్ బాబు మాట్లాడారు. విభజనపై మంత్రుల వైఖరి స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాప్రతినిధులు అందరు రాజీనామా చేసే వరకు తాము సమ్మె చేస్తామన్నారు. మంత్రులతో ఇక ప్రత్యక్ష పోరాటం చేస్తామన్నారు.
ఢిల్లీలోను దీక్ష చేసేందుకు సమాయత్తమవుతున్నారు. ఈ నెల 19వ తేది నుండి న్యాయశాఖ సమ్మెలో పాల్గొననుంది. త్వరలో హైదరాబాదులో లక్ష మందితో భారీ సభకు సిద్ధమవుతున్నామన్నారు. విభజనతో ఒక తరం నష్టపోతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రహదారుల దిగ్బంధం, రిలే దీక్షలు వరుసగా ఉంటాయన్నారు. సమ్మెలో ఉద్యోగుల కుటుంబ సభ్యులు కూడా పాల్గొంటారని చెప్పారు.

అరగుండు గీయించుకున్న ఎమ్మెల్యే
పశ్చిమ గోదావరి జిల్లాలో ఎమ్మెల్యే టివి రామారావు సమైక్యాంధ్రకు మద్దతుగా అరగుండు గీయించుకొని నిరసన తెలిపారు.
ఉద్యమంలో పాల్గొంటా: రాయపాటి
ఎపిఎన్జీవోలకు, ఉద్యోగులకు మద్దతుగా తాను సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొంటానని గుంటూరు పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివ రావు తెలిపారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలంటే కేంద్రమంత్రులు, ఎంపీలు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
పదవి కోసం పాకులాట: మారెప్ప
కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డిపై మాజీ మంత్రి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత మారెప్ప మండిపడ్డారు. ప్రతిభావంతమైన నాయకత్వంతో తెలుగు ప్రజల అభిమానం పొందిన ఆదర్శ నేతగా కోట్ల విజయ భాస్కర రెడ్డి పేరు గడిస్తే, ఆయన కుమారుడు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి మాత్రం పదవుల కోసం పాకులాడుతున్నారని మండిపడ్డారు.












Click it and Unblock the Notifications