వైయస్ 'వీసా' ఇప్పుడర్థమైంది: విహెచ్, ఢిల్లీకి టి నేతలు
హైదరాబాద్: చిత్తూరు జిల్లా తిరుమలలో తాను రెచ్చగొట్టేలా వ్యాఖ్యానించలేదని, దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి వీసా తీసుకొని వెళ్లాల్సి వస్తుందని నాడు ఎందుకన్నారో ఇప్పుడర్థమైందని కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యులు వి హనుమంత రావు ఆదివారం అన్నారు. తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని, రెచ్చగొట్టే విధంగా మాట్లాడలేదని వివరణ ఇచ్చారు.
వీసా తీసుకొని వెళ్లాలని వైయస్ ఎందుకన్నారో అర్థమైందని ఎద్దేవా చేశారు. తిరుపతి వెళ్లాలంటే వీసా తీసుకొని వెళ్లాలేమోనని అనుమానం వ్యక్తం చేశారు. సుదీర్ఘ కాలం తర్వాత తెలంగాణకు న్యాయం జరిగిందన్నారు. హైదరాబాదులో ఉన్న సీమాంధ్రులకు తాము పూర్తి స్థాయిలో భద్రత కల్పిస్తామని చెప్పారు.
రేపు ఢిల్లీకి టి కాంగ్రెసు నేతలు
తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలు ఈ రోజు మినిస్టర్స్ క్వార్టర్సులో భేటీ అయ్యారు. ఈ భేటీలో వారు తీర్మానాలు చేశారు. తెలంగాణ ప్రకటించినందుకు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ, సిడబ్ల్యూసి సభ్యులకు కృతజ్ఞతలు చెబుతూ తీర్మానం చేశారు. విహెచ్ పైన దాడిని ఖండిస్తూ రెండో తీర్మానం చేసినట్లుగా సమాచారం.
రేపు ఆంటోనీ కమిటీకి ఇవ్వనున్న నివేదిక పైన చర్చించారు. సీమాంధ్రుల ఆందోళన తొలగించేందుకు ఏం చర్యలు తీసుకోవాలి? తదితర అంశాలను అందులో పొందుపర్చే విషయమై చర్చించారు. అలాగే సీమాంధ్ర ప్రజాప్రతినిధులు విభజనకు సహకరించాలని వారు కోరారు. కాగా తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలు సోమవారం ఢిల్లీకి వెళ్లనున్నారు.
భద్రాచలం తెలంగాణదే
భద్రాచలం తెలంగాణకు చెందినదేని ఖమ్మం జిల్లా కాంగ్రెసు ప్రజాప్రతినిధులు ఈ భేటీలో చెప్పినట్లుగా సమాచారం. భద్రాచలం తెలంగాణలో అంతర్భాగమేనని చెప్పేందుకు చారిత్రక ఆధారాలున్నాయని వారు చెప్పారు.
ఎన్నికల లబ్ధి కోసమే: పెద్దిరెడ్డి
రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెసు ప్రభుత్వం సీమాంధ్ర ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రయత్నించకుండా రాబోయే ఎన్నికలలో ఎలా లబ్ధి పొందాలనే ఆలోచిస్తోందని టిడిపి సీనియర్ నేత పెద్దిరెడ్డి వేరుగా ఆరోపించారు. టిడిపిని ఓ ప్రాంతానికే పరిమితం చేసి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని, సమస్య పరిష్కారం పట్ల యూపిఏకు చిత్తశుద్ధి కొరవడిందన్నారు. ఇప్పటికే చాలా నష్టం జరిగిందని, కాంగ్రెసు ప్రభుత్వం ఇష్టారీతిగా వ్యవహరిస్తే టిడిపి చూస్తూ ఊరుకోదన్నారు.