తెలంగాణలోనే సభ: మళ్లీ రాష్ట్రానికి నరేంద్ర మోడీ!
ఈ నేపథ్యంలో మరోసారి ఆయనను రప్పించేందుకు రాష్ట్ర బిజెపి నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. మోడీ కూడా సొంతగా పార్టీ పట్టు సాధించేలా చూడాలని, పొత్తులపై ఆశలు పెట్టుకోవద్దని, మనం బలంగా తయారైతే ఇతర పార్టీలే పొత్తుల కోసం వస్తాయని, అవసరమైతే రాష్ట్రానికి మరో మూడు నాలుగు సార్లు వస్తానని.. ఈ నెల 11న రాష్ట్రానికి వచ్చినప్పుడు పదాదికారుల సమావేశంలో సూచించారు.
ఈ నేపథ్యంలో మోడీని మరోసారి రప్పించి బిజెపి శ్రేణుల్లో ఉత్సాహం నింపాలని, తద్వారా పార్టీని పటిష్ట పర్చాలని చూస్తున్నారు. అక్టోబరు తొలి వారంలో ఆయనను రాష్ట్రానికి తీసుకు రావాలని చూస్తున్నారు. తొలుత మహబూబ్ నగర్లో సభ పెట్టాలనుకున్నారు. అయితే మోడీని నిజామాబాద్కు రపపించాలంటూ బిజెపిఎల్పీ యెండల లక్ష్మీ నారాయణ గట్టిగా పట్టుబడుతున్నట్లుగా తెలుస్తోంది.
కరీంనగర్, వరంగల్.. ఇలా పలు జిల్లాల నేతలు కూడా మోడీ సభలు తమ ప్రాంతంలో పెట్టాలని కోరుతున్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, సీనియర్ నేతలు బండారు దత్తాత్రేయ తదితరులు ఆదివారం ఢిల్లీ వెళ్తున్నారు. జాతీయ నాయకత్వంతో చర్చించి నిజామాబాద్ లేదా మహబూబ్ నగర్కు రావాలని మోడీను కోరనున్నారట. అదే సమయంలో లోకసభలో తెలంగాణవాదం గట్టిగా వినిపించిన సుష్మా స్వరాజ్ను కూడా రాష్ట్రానికి రప్పించాలని చూస్తున్నారు.