కెసిఆర్ హీరో, కాంగ్రెసు జీరో: విభజనపై వీరశివారెడ్డి
కాంగ్రెసు తరఫున ప్రజల్లోకి వెళ్తే చీపుర్లతో కొడుతారని ఆయన అన్నారు. సీమాంధ్రలో కొత్త రాజకీయ పార్టీలు వస్తాయని ఆయన అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ చెబుతున్న సమన్యాయం అంటే ఏమిటో విజయమ్మ ప్రజలకు వివరించాలని ఆయన డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రాయలసీమవాసే అయితే తక్షణమే రాజీనామా చేయాలని వీరశివా రెడ్డి అన్నారు.
తెలివి తక్కువతనంతో తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాష్ట్ర విభజనకు నిర్ణయం తీసుకున్నారని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెసులో అందరూ తెలివిలేని నాయకులేనని ఆయన అన్నారు. ఏకపక్ష నిర్ణయం వల్ల సీమాంధ్రలో కాంగ్రెసుకు ఓటేసేవారే ఉండరని ఆయన అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇస్తే కెసిఆర్ హీరో అవుతారని, కాంగ్రెసు జీరో అవుతుందని ఆయన అన్నారు.
రాష్ట్ర విభజన విషయంలో కేంద్ర మంత్రి పి. చిదంబరం, కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్ మైండ్ సెట్ మారాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్కు మద్దతు ఇస్తున్న కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు సబ్బం హరి అన్నారు. ప్రభుత్వ పిచ్చి నిర్ణయాల వల్లనే రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితి నెలకొందని ఆయన అన్నారు.
ప్రజల మనోభావాలకు అనుగుణంగా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ఆయన డిమాండ్ చేశారు. కెసిఆర్ కుటుంబం సెటిల్మెంట్లతో డబ్బులు దండుకుంటోందని ఆయన ఆరోపించారు.