తెలంగాణపై నిర్ణయాన్ని వైయస్ జగన్ ఊహించలేదా?
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కూడా ఊహించలేదు గానీ ఆయన మానసికంగా సిద్ధపడి ఉన్నారు. తెలంగాణ వైఖరిపై తనపై తీవ్రమైన ఒత్తిడి వస్తుండడంతో వ్యక్తిగతంగా ఇష్టం లేకపోయినా ఆయన దానికి అంగీకరించారు. అయితే, తెలుగుదేశం సీమాంధ్ర నాయకులు మాత్రం ఆ పరిస్థితిని ఊహించలేదు. దీంతో కాంగ్రెసు అధిష్టానం నిర్ణయంతో సీమాంధ్ర నాయకులు పార్టీలకు అతీతంగా కంగు తిన్నారు. నిజానికి, కాంగ్రెసు సీమాంధ్ర నాయకులకు మాత్రం ముందుగానే ఆ విషయం తెలుస్తూ వచ్చింది.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు మాత్రమే కాకుండా సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులకు, పార్లమెంటు సభ్యులకు పార్టీ అధిష్టానం ముందుగానే చెప్పారు. అదే విషయం రాష్ట మంత్రులకు, సీమాంధ్ర కాంగ్రెసు నాయకులు చేరింది. ఒక రకంగా వారంతా అందుకు సిద్ధపడి ఉన్నారు. కానీ, వైయస్ జగన్ ఒక్కసారిగా కంగు తిని పూర్తిగా సమైక్యవాదంపై మొగ్గు చూపారు.
తెలంగాణ నాయకుల వాదనను తోసిపుచ్చుతూ జగన్ సమైక్యవాదం ఉద్యమాన్ని నడిపించడానికి నిర్ణయించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని కావాలనే ఆయన ఆశలు విభజనతో గల్లంతైనట్లేనని చెప్పాలి. అయితే, సీమాంధ్రకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలుంటాయి. సీమాంధ్రలో సమైక్యవాద పార్టీగా తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలపై పైచేయి సాధించడానికి ఆందోళనలకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఆందోళనలకు దిగారు.
వైయస్ విజయమ్మతో సహా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు రాజీనామాలు చేశారు. ఆ పార్టీ శాసనసభ్యులు శ్రీకాంత్ రెడ్డి, తదితర శాసనసభ్యులు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. తాజాగా, వైయస్ విజయమ్మ సోమవారం గుంటూరు నిరవధిక నిరాహార దీక్షకు దిగారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ దూకుడుతో తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా నిరాహార దీక్షలకు దిగారు. దూళిపాళ్ల నరేంద్ర చౌదరి, నన్నపనేని రాజకుమారి వంటి తెలుగుదేశం నాయకులు దీక్షలకు దిగారు. మొత్తం మీద, కాంగ్రెసు అధిష్టానం తీసుకున్న ఊహించిన నిర్ణయం జగన్కు సమైక్య ఉద్యమ కార్యాచరణను అందించింది.