వేగం పెంచండి: టి కాంగ్ నేతలు, రాయలపై తర్జన భర్జన
హైదరాబాద్: తెలంగాణ ప్రక్రియను వేగవంతం చేయాలని, హైదరాబాదును పదేళ్లు ఉమ్మడి రాజధానిగా కొనసాగించడానికి ఎలాంటి అభ్యంతరాలు లేవని ఆంటోనీ కమిటీకి చెప్పాలని తెలంగాణ కాంగ్రెసు నేతలు తీర్మానించారు. అదే సమయంలో రాయల తెలంగాణకు సరే అందామా? అనే అంశం పైన కూడా చర్చించారు. తెలంగాణలో పనిచేసే ఉద్యోగుల్లో పదేళ్ల తర్వాత ఎంతమంది మిగిలి ఉంటారో పరిశీలించి వారిని సీమాంధ్రకు పంపించకుండా ఇక్కడే సర్దుబాటు చేయాలని కూడా తీర్మానించారు.
తెలంగాణ కాంగ్రెస్ నేతలు సోమవారం రాత్రి ఎనిమిది గంటలకు ఆంటోనీ కమిటీతో భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలో కమిటీ ముందు చెప్పాల్సిన అంశాలపై ఆదివారం భేటీ అయి చర్చించారు. రెండు గంటలపాటు జరిగిన సమావేశంలో వార్డు సభ్యుని స్థాయి నుంచి కేంద్ర మంత్రుల వరకూ దాదాపు వందమంది పాల్గొన్నారు. హైదరాబాద్కు చెందిన మంత్రులు దానం, ముఖేష్ గౌడ్, ఎంపి అంజన్కుమార్ యాదవ్ భేటీకి హాజరు కాలేదు.

ఢిల్లీ వెళ్లి ఆంటోనీ కమిటీ ముందు ఏయే అంశాలు మాట్లాడాలి? ఎవరెవరు ప్రజెంటేషన్ ఇవ్వాలి? అనే అంశాలపై చర్చించారు. తెలంగాణ పునర్నిర్మాణానికి అవసరమైన సలహా, సూచనలతో నివేదికను రూపొందించుకుని సోమవారం ఆంటోనీ కమిటీతో భేటీ కావాలని నిర్ణయించారు. మొత్తం 30 మంది సభ్యులతో కూడిన బృందం వెళుతున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. వివిధ అంశాలకు సంబంధించి ఆంటోనీ కమిటీకి వివరించేందుకు తొమ్మిది మంది సభ్యులతో కూడిన బృందాన్ని నియమించారు. వీరంతా ఎవరికి కేటాయించిన సబ్జెక్ట్ గురించి వారు వివరించనున్నారు.
కమిటీలో పిసిసి మాజీ అధ్యక్షుడు డి శ్రీనివాస్, డిప్యూటీ సిఎం దామోదర రాజనర్సింహ, డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, డికె అరుణ, గీతా రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు,ఎమ్మెల్సీ యాదవ రెడ్డి ఉన్నారు. సాగునీరు, విద్యుత్కు సంబంధించిన అంశాలను పొన్నాల లక్ష్మయ్య, విభజనతో వివాదాస్పదమైన భద్రాచలం అంశంపై డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్క, హైదరాబాద్, దాని చుట్టూ ఉన్న గ్రేటర్ పరిధి అక్కడి సీమాంధ్రులపై ఎమ్మెల్సీ యాదవ రెడ్డి వివరించాలని తీర్మానించారు.
తెలంగాణ ప్రక్రియను తొందరగా పూర్తి చేయాలని ఆంటోనీ కమిటీని కోరదామని తీర్మానించారు. సీమాంధ్రులు రెచ్చగొట్టినా తెలంగాణ నాయకులు, ఉద్యోగులు రెచ్చిపోవద్దని, సంయమనం పాటించాలని తీర్మానించారు. తిరుపతిలో విహెచ్పై దాడిని ముక్తకంఠంతో ఖండించారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్నా సీమాంధ్రకు సంబంధించిన పురపాలక, పట్టణాభివృద్ధి వ్యవహారాలను జిహెచ్ఎంసి చూసుకోవాలని, శాంతి భద్రతలు కూడా ఎంసిహెచ్ వరకే పరిమితం చేయాలని పాల్వాయి సూచించారు. దీనిపై కేంద్ర నియంత్రణ ఉండేలా కోరదామన్నారు.
హైదరాబాద్పై వచ్చే ఆదాయాన్ని హైదరాబాద్ అభివృద్ధికే ఖర్చు చేయాలన్న ఆయన సూచనను అంతా ఆమోదించారు. 1956 నాటి తెలంగాణ ప్రతిపాదన తీసుకు రావద్దని, దీని వల్ల భద్రాచలం అంశం తలెత్తుతుందని భట్టి విక్రమార్క చెప్పారు. అప్పట్లో భద్రాచలం డివిజన్ సీమాంధ్ర ప్రాంతంలో ఉండడం వల్ల ఇప్పుడు ఆ విషయం సమస్య కావచ్చని అన్నారు. అందుకని ఇప్పుడున్న తెలంగాణ గురించి మాత్రమే ఆంటోనీ కమిటీకి చెబుదామని సూచించారు. రాష్ట్ర విభజన వల్ల వచ్చే సమస్యలపై సీమాంధ్రులతో కలిసి చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలంగాణ కాంగ్రెస్ నేతల సమావేశం తీర్మానించింది.












Click it and Unblock the Notifications