తెలంగాణ రాకుండా సీమాంధ్రుల కుట్ర: కోదండరామ్
సీమాంధ్ర ప్రజలు విభజనకు సహకరించి శాంతిని కాపాడాలని కోరుతూ తెలంగాణ జెఎసి ఆధ్వర్యంలో సోమవారం ఇందిరాపార్క్ వద్ద శాంతి దీక్షలు చేపట్టారు. ఈ దీక్షలను మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య హాజరై ప్రారంభించారు. సీమాంధ్ర పాలకులు తెలంగాణను అడ్డుకోవాలన్న ఆలోచనలో భాగంగానే రెండు ప్రాంతాల ప్రజల మధ్య విద్వేషాలను సృష్టిస్తున్నారని కోదండరాం ధ్వజమెత్తారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలన్న మూడు డిమాండ్లను కేంద్రం దృష్టికి తీసుకువచ్చేందుకే ఈ దీక్షలు చేస్తున్నట్లు చెప్పారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును కాంగ్రెస్ ప్రకటించినప్పటి నుంచి రాష్ట్రంలో విచిత్ర పరిస్థితి ఉందని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు కెటి రామారావు అన్నారు. అప్పటి వరకు తమ హక్కుల కోసం, భద్రత కోసం మాట్లాడిన సీమాంధ్ర ఉద్యోగులు సీఎం కిరణ్కుమార్రెడ్డిని కలిసిన అనంతరం సమైక్య నినాదం విన్పిస్తున్నారని ఆయన అన్నారు.
సీఎం క్యాంప్ కార్యాలమే ఇప్పుడు కుట్రలకు కేంద్రంగా మారిందని, పరోక్షంగా సీమాంధ్ర జేఏసీకి సీఎం చైర్మన్గా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కావూరి, రాయపాటి, లగడపాటి, మేకపాటి నేడు కిరణ్కుమార్రెడ్డిలు తమన మానసిక ఆందోళనను ప్రజలపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని, అదే సీమాంధ్ర ఉద్యమమని విమర్శించారు. తెలంగాణ జేఏసీ, తెరాస చెప్పిన ప్రతిమాట అక్షరసత్యమన్న విషయాన్ని సీమాంధ్ర ఉద్యమం రుజువు చేస్తున్నదని, మీడియా పోకడలను కూడా తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. అక్కడి ఉద్యమాన్ని చానళ్లు నడుపుతున్నాయని ఆరోపించారు.
రాజకీయ పార్టీలు తమ స్వార్థం కోసం ప్రజలను రెచ్చగొడుతున్నాయని మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య అన్నారు. ఎక్కడి ప్రజలు అక్కడ స్థిరపడిపోయారని, తెలంగాణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని, రాష్ట్ర ప్రక్రియ పూర్తి చేయాలని, జై ఆంధ్ర ప్రజాసంఘాలన్నీ కోరుకుంటున్నాయని జై ఆంధ్ర జేఏసీ చైర్మెన్ ఎల్.జయబాబు చెప్పారు.