అబ్బ సొత్తా: కావూరిపై కెటిఆర్, హరిపై చర్యలకు టిడిపికి
హైదరాబాదును ప్రత్యేక రాష్ట్రం లేదా యూటిగా చేయమనేందుకు కేంద్రమంత్రి కావూరి సాంబశివ రావు అయ్య సొత్తా అని ప్రశ్నించారు. హైదరాబాదు తెలంగాణ ప్రజల రక్తమాంసాలతో నిర్మించబడిందన్నారు. సీమాంధ్ర నేతలకు హైదరాబాదులోని తమ ఆస్తుల పైన ఉన్న ప్రేమ ప్రజల పైన లేదన్నారు. యూటిగా చేస్తే ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదన్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రజలు వేలాదిమంది హైదరాబాదులో ఉన్నారని, వారికి లేని భయం సీమాంధ్రులకు ఎందుకన్నారు.
హైదరాబాదుతో కూడిన పది జిల్లాల తెలంగాణ తప్ప మరొకటి అంగీకరించమన్నారు. విభజనను కాంగ్రెసు పార్టీ ఇంటి వ్యవహారంగా చూస్తోందని ఆరోపించారు. తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. హైదరాబాదు పైన పేచి పెడితే ఊరుకునేది లేదన్నారు. విభజనపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు డబుల్ గేమ్ ఆడుతున్నారని మండిపడ్డారు.
బాబు తెలంగాణకు సై అంటే.. ఆయన బావమరిది హరికృష్ణ సమైక్యానికి కట్టుబడతానని లేఖ రాయడమేమిటన్నారు. దేవినేని ఉమామహేశ్వర రావు, పయ్యావుల కేశవ్ వంటి సీమాంధ్ర టిడిపి నేతలు సమైక్యవాదం వినిపిస్తున్నారని, బాబుకు చిత్తశుద్ధి ఉంటే వారిని పార్టీ నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. హరికృష్ణ పైన చర్యలు తీసుకోవాలన్నారు. లేదంటే ప్రతిపక్ష నేతగా, పార్టీ అధ్యక్షుడిగా తప్పుకోవాలన్నారు.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దద్దమ్మ అని, ఆయనకు దమ్ములేదన్నారు. తమ పార్టీ అధ్యక్షుడు కెసిఆర్ సవాల్ విసిరితే పత్తా లేకుండా పారిపోయాడని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఉద్యమం సమయంలో ఎస్మా ప్రయోగించిన కిరణ్ ఇప్పుడు ఎందుకు పెదవి విప్పడం లేదన్నారు. పదమూడేళ్లుగా తాము చెబుతున్న విషయం ఇప్పుడు సీమాంధ్రుల ఆందోళనతో నిజమైందని, నీళ్లు వారు దోచుకుంటున్నారని, అవి లేకపోతే ఎలా బతకాలని అందుకే వారు ప్రశ్నిస్తున్నారన్నారు.
హైదరాబాదులో శాంతిభద్రతలను కేంద్రానికి అప్పగించడమంటే హైదరాబాదు ప్రజలను అవమానించడమే అన్నారు. సీమాంధ్ర ఉద్యమం బూటకమని, అమానవీయమని విమర్శించారు. పొట్టి శ్రీరాములు ఎందుకోసం దీక్ష చేశారో కూడా సీమాంధ్రులకు తెలియదన్నారు. విభజన కోరిన శ్రీరాములుకు పాలాభిషేకం చేస్తూ, విభజనను అడ్డుకున్న ఇందిర గాంధీ విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారని ఎద్దేవా చేశారు.