విభజన వద్దు: కిరణ్ రెడ్డి, సిఎంది సంక్లిష్ట స్థితి: డిగ్గీ
రెండు ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే రాష్ట్రం ఐక్యంగానే ఉండాలని ఆయన సూచించారు. ఒక డ్యామ్ను రెండు రాష్ట్రాలు పంచుకోవాల్సి వస్తుందని ఆయన చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా జలవనరుల పంపిణీ చేయాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. విభజన రెండు ప్రాంతాలకు కూడా నష్టమేనని చెప్పారు. రాష్ట్ర విభజనపై పునరాలోచన చేయాలని ఆయన సూచించారు. నిఘా వర్గాల హెచ్చరికలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు.
అయితే, రాష్ట్ర విభజనపై నిర్ణయం జరిగిపోయిందని, వెనక్కి వెళ్లలేమని ఆంటోనీ కిరణ్ కుమార్ రెడ్డితో చెప్పినట్లు సమాచారం. వివిధ అంశాలపై సీమాంధ్ర ప్రజలకు వివరణ ఇవ్వాలని ముఖ్యమంత్రి సూచించారు. అంతకు ముందు కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర కాంగ్రెసు వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్తో సమావేశమయ్యారు. రేపు బుధవారం కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిసే అవకాశం ఉంది.
కాగా, ఆంటోనీ కమిటీ ముందు సీమాంధ్ర రాష్ట్ర మంత్రులు, శానససభ్యులు, ఎమ్మెల్సీలు సమైక్యవాదాన్ని వినిపించారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని తాము కోరినట్లు ఆంటోనీ కమిటీతో బేటీ అనంతరం మంత్రి శైలజానాథ్ మీడియా ప్రతినిధులతో చెప్పారు. రాయలసీమ, ఆంధ్ర, హైదరాబాద్ ప్రాంతాల ప్రజలు సమైక్యాన్ని కోరుకుంటున్నట్లు తాము చెప్పినట్లు ఆయన తెలిపారు. విఫజన జరిగితే ఇంతకన్నా పెద్ద సమస్యలు తలెత్తుతాయని చెప్పినట్లు తెలిపారు. నదీజలాలు, ఉపాధి కల్పన, ఆర్థికాభివృద్ధి తదితర విషయాల్లో ఇరు ప్రాంతాలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయని వివరించినట్లు ఆయన తెలిపారు.
రాష్ట్రానికి రావాలని ఆంటోనీ కమిటీని కోరినట్లు ఆయన తెలిపారు. విభజన వల్ల తలెత్తే సమస్యలను తాము వివరించినట్లు ఆయన తెలిపారు. హైదరాబాద్పైనా చర్చించామని ఆయన తెలిపారు. హైదరాబాదులో సీమాంధ్రులకు రక్షణ ఉండదని చెప్పినట్లు ఆయన తెలిపారు. తాము చెప్పిన విషయాలను సావధానంగా విన్నారని, రాష్ట్రంలో పర్యటించాలని ఆంటోనీ కమిటీని కోరామన ఆయన చెప్పారు.
రాయలసీమ నీటి సమస్యను ఎలా పరిష్కరిస్తారని తాము అడిగినట్లు మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి చెప్పారు. రాయలసీమ ఎడారిగా మారుతుందని చెప్పినట్లు ఆయన తెలిపారు. రాయల తెలంగాణ ప్రస్తావన రాలేదని ఆయన చెప్పారు. పార్టీ నిర్ణయమే కాబట్టి విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరినట్లు మంత్రి రామచంద్రయ్య తెలిపారు. సీమాంధ్ర నాయకులు దాదాపు రెండు గంటల పాటు ఆంటోనీ కమిటీతో సమావేశమయ్యారు
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సంక్లిష్ట పరిస్థితిని ఎదుర్కుంటున్నారని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్ అన్నారు. సీమాంధ్ర నేతలతో ఆంటోనీ కమిటీ భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల 26, 27, 28 తేదీల్లో మళ్లీ సమావేశమవుతామని ఆయన చెప్పారు. సీమాంధ్ర నేతల అభిప్రాయాలను తాము సావధానంగా విన్నట్లు ఆయన తెలిపారు.