హరి ఇష్యూ: చంద్రబాబుకు ఆగస్టు సంక్షోభం తప్పదా?
హైదరాబాద్: ఆగస్టు నెల తెలుగుదేశం పార్టీకి గండం తెచ్చి పెడుతుందనే అభిప్రాయం బలంగా ఉంది. ఈసారి కూడా తెలుగుదేశం పార్టీకి ఆగస్టు సంక్షోభం తప్పదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ రూపంలో పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి ఆ సంక్షోభం తాకుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న హరికృష్ణ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి, ప్రజా చైతన్య రథయాత్రలు చేస్తారని ప్రచారం సాగుతోంది.
ఎన్టీ రామారావు హయాం నుంచి తెలుగుదేశం పార్టీకి ఆగస్టు గండాలు తప్పడం లేదు. ఆగస్టు వస్తుందంటే తెలుగుదేశం పార్టీ నాయకులు భయపడుతుంటారు. ఎన్టీ రామారావు ఆగస్టు నెలలో రెండు భారీ ఎదురు దెబ్బలు తగిలాయి. రెండు సార్లు కూడా ఆయన అధికారాన్ని కోల్పోయారు. 1984 ఆగస్టు 15వ తేదీన నాదెండ్ల భాస్కర రావు ఎన్టీ రామారావుపై తిరుగుబాటు చేశారు. ఎన్టీ రామారావును గద్దె దింపారు. అయితే, ప్రతిపక్షాల ఉద్యమం తీవ్ర రూపం దాల్చడంతో తిరిగి ఎన్టీ రామారావును ఇందిరా గాంధీ ఎన్టీ రామారావుకు ముఖ్యమంత్రి పీఠాన్ని అప్పగించారు.

ఆ తర్వాత సరిగ్గా 11 ఏళ్లకు ఎన్టీ రామరావుపై ప్రస్తుత తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తిరుగుబాటు చేశారు. ఇది 1995 ఆగస్టులో జరిగింది. అయితే, ఈసారి ఎన్టీ రామారావు తిరిగి అధికారాన్ని పొందలేకపోయారు. తీవ్రమైన కలతకు ఎన్టీ రామారావు గురయ్యారు. అనంతరం 1996 జనవరి 18వ తేదీన ఆయన కన్ను మూశారు. ప్రతి యేటా ఆగస్టులో తెలుగుదేశం ఏదో ఒక కుదుపునకు గురవుతూనే ఉన్నది.
అయితే, ఈసారి రాష్ట్ర రాజకీయాల్లో ఆగస్టు సంక్షోభం కాంగ్రెసును చుట్టుముడుతుందని భావించారు. కానీ అది తెలుగుదేశం పార్టీలో పెద్ద ముసలమే సృష్టించేట్లుంది. చాలా కాలంగా చంద్రబాబుపై అసంతృప్తితో ఉన్న నందమూరి హరికృష్ణ తిరుగుబాటు ప్రకటించారు. ఆయన చంద్రబాబుపై పోరాటానికి సిద్ధపడ్డారని అంటున్నారు. ఇప్పటికే ఎన్టీ రామారావుకు విధేయులైనవారిని చంద్రబాబు పార్టీకి దూరం చేశారనే అభిప్రాయం ఉంది. వారంతా కలిసి హరికృష్ణకు మద్దతు ఇస్తారా అనేది ఆసక్తిగా మారింది.
హరికృష్ణ చంద్రబాబు తెలంగాణ అనుకూల వైఖరిని వ్యతిరేకించి, సమైక్య నినాదంతో ముందుకు వస్తున్నారు. దాంతో సమైక్య నినాదంతో సీమాంధ్రలో ఆందోళనకు దిగిన తెలుగుదేశం పార్టీ నాయకులు హరికృష్ణ వెంట నడుస్తారా అనేది కూడా ఆసక్తిగానే మారింది. పలు జిల్లాల్లో సమైక్య నినాదంతో టిడిపి నాయకులు ఆమరణ నిరాహారదీక్షలు చేపట్టారు. నందమూరి హరికృష్ణకు ప్రజా చైతన్య యాత్రలో జూనియర్ ఎన్టీఆర్ కూడా చేరితే చంద్రబాబుకు తీవ్రమైన తలనొప్పిగా మారే ప్రమాదం ఉందని అంటున్నారు.












Click it and Unblock the Notifications