సహకరించండి: సిఎంకు తెలంగాణ మంత్రుల విజ్ఝప్తి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సహకరించాలని తెలంగాణ రాష్ట్ర మంత్రులు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కోరారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని శనివారం కలిసి వారు ఆ మేరకు విజ్ఝప్తి చేశారు. ఈ నెల 28వ తేదీన మరోసారి సమావేశమై భవిష్యత్తు కార్యాచరణను రూపొందించుకుంటామని తెలంగాణ మంత్రులు చెప్పారు. అంతకు ముందు తెలంగాణ మంత్రులు సచివాలయంలో కె. జానారెడ్డితో సమావేశమై ముఖ్యమంత్రితో మాట్లాడాల్సిన విషయాలపై చర్చించారు.
ముఖ్యమంత్రిని కలిసినవారిలో తెలంగాణకు చెందిన మంత్రులు కె. జానారెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నాల లక్ష్మయ్య, డికె అరుణ, సునితా లక్ష్మారెడ్డి, బస్వరాజు సారయ్య, సుదర్శన్ రెడ్డి ఉన్నారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై వారు చర్చించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ వేగం పుంజుకునేలా చూడాలని వారు ముఖ్యమంత్రిని కోరారు.
ఇదిలావుంటే, రాష్ట్ర విభజన విషయంలో సీమాంధ్ర తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీ నాయకులు యూ టర్న్ తీసుకోవడం సరి కాదని కాంగ్రెసు నాయకుడు పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. విభజనకు అంగీకరించిన నేతలు విధానాలను మార్చుకోవడం ఏమిటో ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని ఆయన శనివారం మీడియాతో అన్నారు.
సీమాంధ్ర తెలుగుదేశం, కాంగ్రెసు నేతల తీరు వల్ల తెలుగు ప్రజల మధ్య ఉన్న సామరస్యం దెబ్బ తింటుందని ఆయన అన్నారు. విభజనకు నేతలు సహకరించకపోతే విపరీత పరిస్థితులు తలెత్తుతాయని ఆయన అభిప్రాయపడ్డారు.