జగన్ ఫోన్: భారతితో భేటీ, విజయమ్మ దీక్ష విరమణ
హైదరాబాద్: పార్టీ అధ్యక్షుడు, తనయుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి విజ్ఝప్తితో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ నిరవధిక నిరాహార దీక్షను శనివారం విరమించారు. శుక్రవారం అర్థరాత్రి దాటిన తర్వాత ఆమెను పోలీసులు ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. ఆస్పత్రిలో కూడా ఐబి ఫ్లూయిడ్స్ను తీసుకోవడానికి నిరాకరించారు. దీంతో జగన్ చంచల్గుడా జైలు అధికారుల అనుమతితో విజయమ్మకు ఫోన్ చేశారు.
విజయమ్మ ఆరోగ్య పరిస్థితిని ఆయన అడిగి తెలుసుకున్నారు. దీక్ష విరమించాలని కోరారు. దీంతో విజయమ్మ నిరాహార దీక్షను విరమించారు. వైయస్ జగన్ తన నిరాహార దీక్షను రేపు ఆదివారం చంచల్గుడా జైలులో ప్రారంభించే అవకాశం ఉంది. తన దీక్షకు ముందు ఓ బహిరంగ లేఖను కూడా ఆయన రాయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. వైయస్ జగన్ను ఆయన భార్య భారతి శనివారం జైలులో కలిశారు. తన దీక్ష విషయమై, తాను రాయలనుకుంటున్న బహిరంగ లేఖపై ఆయన భారతితో చర్చించినట్లు తెలుస్తోంది. పార్టీ ముఖ్య నాయకులు కూడా జగన్ను కలిశారు. జగన్ దీక్ష చేస్తారని భారతి మీడియాతో చెప్పారు.

ఆయన బహిరంగ లేఖ రేపో మాపో విడుదల కావచ్చునని అంటున్నారు. పార్టీ నుంచి తప్పుకున్న తెలంగాణ నాయకులకు తన బహిరంగ లేఖలో జగన్ సమాధానమిస్తారని అంటున్నారు. రాష్ట్ర విభజనపై వైయస్ జగన్ వైఖరిని నిరసిస్తూ కొండా సురేఖ దంపతులు సహా కెకె మహేందర్ రెడ్డి, జిట్టా బాలకృష్ణా రెడ్డి తదితరులు పార్టీకి రాజీనామా చేశారు.
రాష్ట్ర విభజనపై తీరుపై కాంగ్రెసు పార్టీ అనుసరించిన విధానాన్ని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తప్పుపడుతోంది. అయితే, జగన్ నిరాహార దీక్షకు సంబంధించి తమకు దరఖాస్తు రాలేదని జైలు సూపరింటిండెంట్ చెప్పారు. దరఖాస్తు వస్తే నిబంధనల మేరకు పరిశీలించి చర్యలు తీసుకుంటామని చెప్పారు.












Click it and Unblock the Notifications