ముంబై గ్యాంగ్ రేప్: ప్రశ్నలు కురిపించిన సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ: ముంబైలో ఫొటోగ్రాఫర్పై జరిగిన సామూహిక అత్యాచారం విషయంలో దేశంఆందోళన సుప్రీంకోర్టులో ప్రతిబంబించింది. దేశంలో పెచ్చరిల్లుతున్న అత్యాచారాలపై ప్రశ్నల మీద ప్రశ్నలు వేసింది. వ్యవస్థలో ఉన్న తప్పేమిటి, 90 శాతం అత్యాచారం కేసుల్లో నిందితులు ఎందుకు నిర్దోషులుగా విడుదలవుతున్నారు అని ప్రశ్నిస్తూ పరిస్థితి విషమిస్తోందని సుప్రీంకోర్టు ఆవేదన వ్యక్తం చేశింది.
అత్యాచారాలు పదే పదే ఎందుకు జరుగుతున్నాయని, అది కూడా మెట్రోపాలిటన్ నగరాల్లోనే అవి ఎందుకు జరుగుతున్నాయని న్యాయమూర్తి ప్రశ్నించారు. హర్యానాలో సామూహిక అత్యాచారానికి గురైన మహిళ తండ్రి దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా న్యాయమూర్తి ఆ ప్రశ్నలు వేశారు.
పిటిషన్ కూతురికి హర్యానా ప్రభుత్వం భద్రత కల్పించలేకపోయిందా అని అడిగారు. తనపై దాడి గురించి ఫిర్యాదు చేసిన తర్వాత ఆమె తల్లిని కాల్చి చంపారని, ఆమెకు బెదిరింపులు వస్తున్నాయని కుటుంబ సభ్యులు చెప్పారు. అత్యాచార బాధితుల కోసం పునరావాస విధానాన్ని రూపొందించాలని న్యాయమూర్తి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించారు.
మహిళా ఫొటోగ్రాఫర్పై అత్యాచారానికి పాల్పడిన ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. త్వరలోనే చార్జిషీట్ దాఖలు చేస్తామని ముంబై పోలీసు కమిషనర్ సత్యపాల్ సింగ్ చెప్పారు.