రాజకీయాలకు సమయమా?, రెచ్చగొడ్తున్నారు: బాబు
సోమవారం బాబు ఓ ప్రకటన చేశారు. కాంగ్రెస్, తెరాస, వైయస్సార్ కాంగ్రెసు ఈ వికృత క్రీడలో భాగస్వాములు కావడం దురదృష్టకరమని, ఈ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నానని పేర్కొన్నారు. కొన్ని రోజులుగా సచివాలయం, విద్యుత్ సౌధ, జల సౌధ, ఇతర కార్యాలయాల్లో సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని, సమస్యల పరిష్కారానికి ఉద్యోగులు తమకు తోచిన విధంగా శాంతియుత ఉద్యమాలు చేసుకోవచ్చునని సూచించారు.
అలాంటప్పుడు ఇతరులు వారి కార్యక్రమాలను అడ్డుకోవడం, రెచ్చగొట్టేలా వ్యవహరించడం, రాజకీయ లబ్ధికోసం ప్రయత్నించడం మంచిది కాదన్నారు. ఇరవై ఏడు రోజులుగా వివిధ వర్గాల ప్రజలు ఆందోళనచేస్తున్నా వారిని శాంతింపజేసే ప్రయత్నాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేయకపోవడం గర్హనీయమన్నారు.
తాంబూలాలిచ్చాం.. తన్నుకు చావండన్న రీతిలో కాంగ్రెస్ నేతలు, కేంద్ర ప్రభుత్వ పెద్దలు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. సున్నితమైన తెలంగాణ అంశాన్ని సమగ్ర రీతిలో పరిష్కరించాల్సిన కాంగ్రెస్, రాజకీయ ప్రయోజనాల కోసం జఠిలం చేసి ప్రజల మధ్య చిచ్చు పెట్టిందన్నారు.