సోనియా డిశ్చార్జ్: ఓటింగ్ ప్రక్రియ టైంలో అస్వస్థత
న్యూఢిల్లీ: ఆహార భద్రత బిల్లు పైన సోమవారం సుదీర్ఘ చర్చ జరిగిన అనంతరం కాంగ్రెసు పార్టీ అధినేత్రి సోనియా గాంధీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను చికిత్స కోసం ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం ఆమెను డిశ్చార్జ్ చేశారు.
సోనియా వెంట ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రి షెల్జా ఉన్నారు. గత రెండు రోజులుగా వైరల్ ఫీవర్తో బాధపడుతున్న సోనియా లోక్సభలో జరిగిన ఆహార భద్రతా బిల్లు అంశంపై చర్చకు హాజరయ్యారు. తీవ్ర అనారోగ్యానికి గురవడంతో చర్చ అనంతరం బిల్లుపై జరిగిన ఓటింగులో పాల్గొనకుండానే సోనియా, రాహుల్లు సభ నుంచి ఆస్పత్రికి వెళ్లిపోయారు.
ఓటింగ్ ప్రక్రియ జరుగుతుండగానే సోనియాకు ఛాతిలో నొప్పి వచ్చింది. ఆమె ముందు రోజు నుండే వైరల్ ఫీవర్తో బాధపడుతున్నా, తానెంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఆహార భద్రత బిల్లుపై సోమవారం సభలో చర్చలో పాల్గొన్నారు. దీనిపై విపక్షాలు సూచించిన సవరణలపై ఓటింగు జరుగుతుండగా, రాత్రి 8.15 గంటల సమయంలో సెల్జా, రాహుల్లు సోనియాను సరాసరి ఎయిమ్స్కు తరలించారు.
పార్టీ అధినేత్రి సోనియా ఎయిమ్స్ నుండి డిశ్చార్జ్ అయినట్లు కేంద్రమంత్రి గులాం నబీ ఆజాద్ తెలిపారు. సోనియా జ్వరం, జలుబులతో బాదపడుతున్నారని, వైద్య పరీక్షల అనంతరం వైద్యులు ఇంటికి పంపించినట్లు ఆయన చెప్పారు. ప్రస్తుతం సోనియా పూర్తి ఆరోగ్యంగా ఉన్నారన్నారు.