సమైక్య: తొక్కుడు బిళ్ల, జగన్ ఫోటోతో జలదీక్ష(పిక్చర్స్)
హైదరాబాద్: సిడబ్ల్యూసి, యూపిఏ విభజన నిర్ణయం నేపథ్యంలో సీమాంధ్రలో రాజుకున్న మంటలు చల్లారడం లేదు. రాజధాని హైదరాబాదుతో పాటు పదమూడు జిల్లాల్లో సమైక్యాంధ్ర కోసం ఉద్యమం ఉధృతంగా జరుగుతోంది. మరోవైపు, ఈ పార్లమెంటు సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు పెట్టాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఐకాస శాంతి దీక్షలు చేస్తోంది.
ఈ నేపథ్యంలో హైదరాబాదులోని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యుత్ సౌధ, సచివాలయం, అరణ్య భవన్ తదితర ప్రాంతాల్లో నిత్యం ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఇరు ప్రాంతాల ఉద్యోగులు పోటా పోటీ నినాదాలు చేస్తున్నారు. రాజకీయ నాయకులు వచ్చి సంఘీభావం తెలుపుతుండటం మరింత ఉద్రిక్తతకు దారి తీస్తుండటంతో పోలీసులు వారిని అనుమతించడం లేదు.
విశాఖలో ఎయు విద్యార్థులు తమ విశ్వవిద్యాలయంలోకి రాజకీయ నాయకులను అనుమతించడం లేదు. చాలాచోట్ల రాజీనామా చేశాకే తమ ఆందోళనల్లో పాల్గొనాలని డిమాండ్ చేస్తున్నారు. క్రికెట్, కబడ్డీ, ఖోఖో ఆడుతూ, రాజకీయ నాయకుల మాస్కులు ధరించి సమైక్యవాదులు నిరసన తెలుపుతున్నారు.
సమైక్యాంధ్రకు మద్దతుగా కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలో మంగళవారం లక్షలాది మంది ఒక్కసారిగా జై సమైక్యాంధ్ర, జైజై సమైక్యాంధ్ర అంటూ నినదించారు. ఎపిఎన్జీవో ఉద్యోగుల జెఎసి ఆధ్వర్యంలో పట్టణంలోని సంజీవనగర్ వద్ద నిర్వహించిన లక్ష జన ఘోషకు జనం స్వచ్చందంగా తరలి వచ్చారు. సంజీవనగర్లోని పొట్టి శ్రీరాములు సర్కిల్ జనంతో కిటకిటలాడింది.
జై సమైక్యాంధ్ర
రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని డిమాండ్ చేస్తూ విద్యుత్ సౌధలో సీమాంధ్ర ఉద్యోగులు నిరసనలు వ్యక్తం చేస్తున్న దృశ్యం. ఈ ఆందోళనలో ఉద్యోగులు జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేశారు.
తొక్కుడు బిళ్ల
సమైక్యాంధ్రకు మద్దతుగా విద్యుత్ సౌధ వద్ద సీమాంధ్ర ఉద్యోగులు వినూత్నంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగులు వివిధ రకాల ఆటలు ఆడి నిరసన తెలుపుతున్నారు. తొక్కుడు బిళ్ల ఆడుతున్న ఓ ఉద్యోగి.
కబడ్డి.. కబడ్డి
రాష్ట్రాన్ని విడగొట్టవద్దని కోరుతూ విద్యుత్ సౌధలో విధులను బహిష్కరించిన సీమాంధ్ర ఉద్యోగులు కార్యాలయ ప్రాంగణంలో కబడ్డీ ఆడుతున్న దృశ్యం.
దిష్టి బొమ్మ దగ్ధం
రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి సీమాంధ్ర పక్షపాతిగా మాట్లాడుతున్నారని నిరసన వ్యక్తం చేస్తూ ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేస్తున్న టిఆర్ఎస్వి విద్యార్థి.
కెటిఆర్, నాయిని
రైల్వే రోకో కేసులో సికింద్రాబాద్ రైల్వే కోర్టుకు హాజరై వస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు కెటి రామారావు, నాయిని నర్సింహా రెడ్డి తదితరులు.
హైదరాబాద్ అందరిదీ
రాష్ట్ర రాజధాని హైదరాబాదు అందరిదీ అంటూ సచివాలయంలో నిరసన తెలుపుతున్న సీమాంధ్ర సచివాలయ ఉద్యోగులు. హైదరాబాదు పైన అందరికీ హక్కుందని నినాదాలు చేశారు.
హైదరాబాద్ ఫర్ ఆల్
భజనలు మానండి.. విభజన ఆపండి, హైదరాబాద్ అందరిదీ అంటూ నినాదాలు చేస్తూ సచివాలయంలో మంగళవారం నిరసన వ్యక్తం చేస్తున్న సీమాంధ్ర ఉద్యోగులు.
ర్యాలీ
సచివాలయంలో భారీ ర్యాలీ నిర్వహిస్తున్న సీమాంధ్ర ఉద్యోగులు. రాష్ట్రాన్ని విడగొట్టవద్దని, హైదరాబాదు పైన అందరికీ హక్కు ఉందని వారు నిరసన తెలిపారు.
బస్వరాజు సారయ్య
సచివాలయానికి వచ్చిన బిసి సంక్షేమ శాఖ మంత్రి, వరంగల్ జిల్లా శాసన సభ్యుడు బస్వరరాజు సారయ్య తదితరులు. ఓ వైపు సీమాంధ్ర, మరోవైపు తెలంగాణ ఉద్యోగుల నిరసనల సమయంలోనే ఆయన వచ్చారు.
ర్యాలీ 2
సచివాలయంలో భారీ ర్యాలీ నిర్వహిస్తున్న సీమాంధ్ర ఉద్యోగులు. రాష్ట్రాన్ని విడగొట్టవద్దని, హైదరాబాదు పైన అందరికీ హక్కు ఉందని వారు నిరసన తెలిపారు.
నాగం
తెలంగాణ ఉద్యోగులకు సంఘీభావం తెలిపేందుకు సచివాలయానికి వచ్చిన బిజెపి నేత, నాగర్ కర్నూలు ఎమ్మెల్యే నాగం జనార్ధన్ రెడ్డి. ఆయన అనంతరం విద్యుత్ సౌధకు వెళ్లారు. అక్కడ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.
బిఆర్కె భవ్
హైదరాబాదులోని బిఆర్కె భవన్లో తెలంగాణ ఉద్యోగులు, సీమాంధ్ర ఉద్యోగుల మధ్య మంగళవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు కలుగ చేసుకోవడంతో పరిస్థితి సద్దుమణిగింది.
తిరుపతి 1
చిత్తూరు జిల్లా తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఎదుట రాష్ట్రాన్ని విభజిస్తే దుర్భిక్షం అంటూ నిరసన తెలుపుతున్న దృశ్యం.
తిరుపతి 2
ఇంటికి ఒ దిష్టి బొమ్మ ఉంటుంది.. అలాగే మన రాష్ట్రానికి రెండు దిష్టి బొమ్మలు అంటూ సోనియా గాంధీ, కెసిఆర్ ఫోటోలతో నిరసన తెలుపుతున్న సమైక్యవాదులు.
విశాఖ 1
సమైక్యాంధ్రకు మద్దతుగా విశాఖలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఆధ్వర్యంలో జలదీక్షతో నిరసన తెలుపుతున్న దృశ్యం. ఆ పార్టీ తమ అధ్యక్షుడు వైయస్ జగన్ ఫోటోలు ప్రదర్శిస్తూ నిరనస వ్యక్తం చేసింది.
విశాఖ 2
సమైక్యాంధ్ర మెడికల్ ఐకాస ఆధ్వర్యంలో విశాఖలో రాష్ట్రాన్ని విడగొట్టవద్దంటూ భారీ ర్యాలీ నిర్వహించారు. సోనియాను రాక్షసిగా, కావూరి, చిరంజీవిలకు చీరలు కట్టి నిరసన తెలిపారు.