ఏ కత్తితో పొడవాలో చెప్పారు: జగన్ పార్టీపై బాబు
హైదరాబాద్: రాష్ట్ర విభజన విషయంలో ఏ కత్తితో పొడవాలో చూపించింది వైయస్సార్ కాంగ్రెసు పార్టీయే అని, రాజ్యాంగంలోని 3వ ప్రకరణ ప్రకారం రాష్ట్ర ఏర్పాటుకు కేంద్రానిదే బాధ్యత అని చెప్పిందని, ఇప్పుడు రాష్ట్ర విభజనకు తమ పార్టీని నిందిస్తోందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రాన్ని ఎలా విభజించవచ్చునో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కేంద్రానికి చెప్పిందని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఇచ్చిన లేఖను ఆయన చదివి వినిపించారు. వాటాదారులందరితో సంప్రదించి నిర్ణయం తీసుకోవాలని, ఇష్టానుసారం చేయడం తగదని ఆయన తెలంగాణ ఏర్పాటు నిర్ణయంపై అన్నారు. అందరికీ సమన్యాయం చేయాలని ఆయన అన్నారు.
అందరికీ న్యాయం చేసే బాధ్యతను ప్రధాని మన్మోహన్ సింగ్ తీసుకోవాలని, అలాంటి బాధ్యతకు ఏ మాత్రం ప్రయత్నం చేయలేదని ఆయన అన్నారు. కాంగ్రెసు పార్టీ వైయస్సార్ కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలతో లాలూచీ పడిందని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో విమర్శించారు. బెయిల్ కోసం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ, ప్యాకేజీల కోసం తెరాస కాంగ్రెసుతో కలిసి రాజకీయాలు చేస్తున్నాయని ఆయన అన్నారు. అందరు కలిసి పరష్కరించే మార్గం కనుక్కోవాలి గానీ రెచ్చగొట్టే పని చేయవద్దని ఆయన అన్నారు.
రాష్ట్ర విభజన విషయంలో సమన్యాయం చేయాలని తాము సూచించామని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెసు దుర్మార్గాలపై తాము రాజీ లేని పోరాటం చేస్తున్నామని ఆయన చెప్పారు. తమ తొమ్మిదేళ్ల పాలనను, కాంగ్రెసు ఈ తొమ్మిదేళ్ల పాలనను బేరీజు వేస్తూ విషయాలను తన యాత్రలో ప్రజలకు చెబుతానని ఆయన అన్నారు. తమ తొమ్మిదేళ్ల పాలనలో ఒక్క రోజు కూడా సమ్మె జరగలేదని, ఇప్పుడు సమ్మె లేని రోజు లేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
రాష్ట్రానికి అన్యాయం చేసినప్పుడు పోరాటం చేసే బాధ్యత తమపై ఉందని ఆయన అన్నారు. రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెసు పార్టీ హోం వర్కు చేయలేదని ఆయన అన్నారు. ఇన్ని రోజులు ప్రజలు రోడ్లపై ఉంటే స్పందించాల్సిన బాధ్యత ప్రధానికి లేదా అని అడిగారు. వాస్తవాలను దృష్టిలో పెట్టుకుని ప్రయత్నిస్తే సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆయన అన్నారు. కాంగ్రెసు బాధ్యతరాహిత్యాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్తానని ఆయన అన్నారు. గుజరాత్ కన్నా మెరుగ్గా ఆంధ్రప్రదేశ్ ఉండేదని, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని ఆయన అన్నారు. సమస్య పరిష్కారం కోసం అందరం కూర్చుని మాట్లాడుకోవాలని ఆయన అన్నారు.
వైయస్ రాజశేఖర రెడ్డి రాష్ట్రాన్ని దోచుకుని ఢిల్లీకి కప్పం కట్టాడని, తెలంగాణ ఇవ్వాలని ఢిల్లీకి వినతిపత్రం ఇచ్చాడని ఆయన అన్నారు. వైయస్ ఉండి ఉంటే ఈ బాధ ఉండేది కాదని ప్రధాని వ్యాఖ్యానించడం సిగ్గుచేటు అని ఆయన అన్నారు. తెలుగువారంటే కేంద్రానికి లెక్క లేదని ఆయన అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసమే రాష్ట్ర విభజనపై కసరత్తు లేకుండా వ్యవహరించారని ఆయన అన్నారు.
రాష్ట్రంలో తొలి మూడున్నరేళ్లు తెలంగాణలో ఉద్యమాలు జరిగాయని, ఇప్పుడు సీమాంధ్ర ప్రజలు రోడ్ల మీదికి వచ్చారని, రాష్ట్రంలో అనిశ్చితి ఉందని, శాంతిభద్రతలు లేవని ఆయన అన్నారు. రాజకీయ ప్రయోజనం పొందాలని, తమ పార్టీ దెబ్బ తీయాలని కాంగ్రెసు పార్టీ కుట్ర చేస్తోందని ఆయన విమర్సించారు. విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తున్నారని ఆయన అన్నారు. తమ పార్టీని దెబ్బ తీయడానికి ఎవరిని పడితే వారిని వాడుకుని సీట్లు సంపాదించుకుని రాహుల్ గాంధీని ప్రధాని చేయాలనే దుగ్ధ తప్ప మరేమీ లేదని ఆయన అన్నారు.
హైదరాబాద్పై ఉద్యోగాలు, చదువులు ఆధారపడి ఉన్నాయని, రాష్ట్రానికి ఇప్పుడే సరిగా నీరు రావడం లేదని, హైదరాబాదులో భద్రత లేదని, ఈ సమస్యలను పరిష్కారం చేయకుండా ప్రధాని మన్మోహన్ సింగ్ ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. న్యాయం కోసం తాను ప్రజల్లోకి వెళ్తున్నానని ఆయన అన్నారు. తాను తెలంగాణకు కూడా వెళ్లానని ఆయన చెప్పారు. నిర్ణయానికి ముందు తీసుకోవాల్సిన చర్యలేవీ తీసుకోలేదని ఆయన అన్నారు. ఎపి ఎన్జీవోలు పార్టీకి చెందిన ఆంటోనీ కమిటీకి అభిప్రాయాలు చెప్పాలని ప్రధాని అనడం సిగ్గుచేటు అని ఆయన అన్నారు.
రాష్ట్ర విభజనను వైయస్ రాజశేఖర రెడ్డి ప్రారంభించారు, సోనియా పూర్తి చేశారని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్ ఓసారి చెప్పారని, తెలుగుదేశం పార్టీ లేఖ ఇచ్చింది కాబట్టి నిర్ణయంత తీసుకున్నామని మరోసారి చెప్పారని, పొంతన లేకుండా దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. తెలుగుజాతికి చిచ్చు పెట్టింది కాంగ్రెసు పార్టీ, దానికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ, తెరాస సహకరించిందని, ఆ తప్పు కాంగ్రెసు పార్టీదని ఆయన అన్నారు. ఈ మూడు పార్టీలను దోషులుగా నిలబెడతామని ఆయన అన్నారు. సమస్యలను పరిష్కారం చేయకుండా కాంగ్రెసు జఠిలం చేస్తోందని ఆయన అననారు.
తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవిస్తామని, కేంద్రం నిర్ణయం తీసుకోవాలని, నిర్ణయం ద్వారా అందరికీ న్యాయం చేయాలని తాము చెప్పామని, ఇదే విషయాన్ని ప్రజలకు చెబుతానని ఆయన అన్నారు. స్థానిక ప్రజల మనోభావాలను బట్టి అక్కడక్కడ మాత్రమే తమ పార్టీ నాయకులు దీక్షలు చేస్తున్నారని ఆయన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.