దిల్సుఖ్నగర్ పేలుళ్లు మాపనే: భత్కల్, కోల్కతాలో...
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాదులోని దిల్సుఖ్ నగర్ జంట పేలుళ్లు తమ పనేనని ఇండియన్ ముజహిదీన్ వ్యవస్థాపకుడు, మోస్ట్ వాంటెడ్ తీవ్రవాది యాసిన్ భత్కల్ జాతీయ దర్యాఫ్తు సంస్థ(ఎన్ఐఏ) విచారణలో అంగీకరించినట్లుగా తెలుస్తోంది. దిల్సుఖ్ నగర్తో పాటు వారణాసి తదితర ప్రాంతాల్లోని పేలుళ్లు తమ పనేనని భత్కల్ విచారణలో అంగీకరించాడు.
పేలుళ్లకు ముందే తాము హైదరాబాదులో మకాం వేశామని చెప్పాడు. ముందు పలుమార్లు రెక్కీ నిర్వహించి తమ టార్గెట్ను ఎంచుకన్నామని జాతీయ దర్యాఫ్తు సంస్థ అధికారులకు చెప్పాడు. మరోవైపు ఢిల్లీలోని పాటియాలా హౌస్ న్యాయస్థానం యాసిన్ భత్కల్, అక్తర్లకు పన్నెండు రోజుల కస్టడీ విధించింది.
కాగా, ఇటీవల నేపాల్ సరిహద్దులో అరెస్టు చేసిన తీవ్రవాదులు యాసిన్ భత్కల్, అసదుల్లా అక్తర్లను శుక్రవారం మధ్యాహ్నం భద్రతా దళాలు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తరలించిన విషయం తెలిసిందే. బీహార్లో ఉగ్రవాద కార్యకలాపాలకు వెళ్తుండగా అరెస్టు చేసినట్లు చెప్పారు. బీహార్ పోలీసులతో కలిసి ఆపరేషన్ నిర్వహించి వారిని పట్టుకున్నట్లు చెప్పారు. విచారణ కొనసాగుతోందన్నారు.
గురువారం రాత్రి యాసిన్ భత్కల్ పాట్నా జైలులో నిద్రలేమితో గడిపినట్లుగా బీహార్ పోలీసు అధికారులు చెప్పారు. శుక్రవారం ఉదయం ఎన్ఐఏ అదికారులు భత్కల్ను ప్రశ్నించారు. తదపరి విచారణకు భత్కల్ను ఢిల్లీకి తరలించారు. భత్కల్ను తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కార్యాలయానికి పన్నెండు రాష్ట్రాల వారు దరఖాస్తు చేసుకున్నట్లుగా తెలుస్తోంది.
కలకత్తాలో బాంబు పేలుడు
కలకత్తాలోని చాందినీ చౌక్ ఎదుట శుక్రవారం బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒకరు గాయపడ్డారు. పేలుడు విషయం తెలుకున్న బాంబు స్క్వాడ్ వెంటనే రంగంలోకి దిగి పేలుడుకు అమర్చిన మరో రెండు బాంబులను కనిపెట్టి వాటిని నిర్వీర్యం చేశారు.